ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు సార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న పహల్గాం ఉగ్రవాదులు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 10:31 PM

ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. కాల్పుల అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే నాలుగు సార్లు ట్రాక్ చేయగా.. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఓసారి భద్రతా బలగాలపై కాల్పులకు కూడా తెగబడ్డారు. ఆపై మరోచోట భోజనం తీసుకుని పారిపోయారు. అయినా భారత బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.


దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు విపరీతంగా కష్ట పడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఇంటిలిజెన్స్ నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తూ.. పట్టుకునేందుకు వెళ్లగా క్షణాల్లో తప్పించుకుంటున్నారు. అడవులు చిక్కగా ఉండడం, కనిపించే వాళ్లు ఉగ్రవాదులేనా కాదా అని ధ్రువీకరించుకోవాల్సి ఉండగా.. భద్రతా బలగాలు కాస్త సమయం తీసుకోవాల్సి వస్తోంది. కానీ ఉగ్రవాదులు మాత్రం అలికిడి వస్తే చాలు కాల్పులు జరుపుతూ క్షణాల్లో జారుకుంటున్నారు. వారెన్ని సార్లు తప్పించుకున్న అతి త్వరలోనే వాళ్లను పట్టుకుని తీరుతామని ఓ సైనిక అధికారి వెల్లడించారు.


అయితే తొలిసారి భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను పహల్గాం తెహస్లీ వద్ద ట్రాక్ చేశారు. కానీ వీరు అక్కడకు వెళ్లేలోపే వారు మళ్లీ అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలు కనిపించగా.. భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ముందుగానే విషయం గుర్తించిన ముష్కరులు.. అధికారులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత త్రాల్ కొండల్లో ఉగ్రవాదులు నక్కినట్లు గుర్తించగా.. అక్కడికి చేరుకునేలోపే కొకెర్నాగ్ లొకేషన్‌కు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం వీరంతా ఆ ప్రాంతం చుట్టుపక్కలే ఉండొచ్చని అధికారలు వెల్లడిస్తున్నారు.


ముఖ్యంగా ఇక్కడి ఓ స్థానిక గ్రామంలోని ఇంట్లోకి వారు రాత్రి భోజనానికి వెళ్లగా అక్కడికి దళాలు చేరుకున్నాయి. అప్పుడు వారు ఆహారం తీసుకుని పారిపోయారు. అయితే ఈ విషయాన్ని నేరుగా సైనిక అధికారులే వెల్లడించారు. ఉగ్రవాదులు తరచుగా ప్రాంతాలు మారుస్తూ.. నడుస్తూనే తిరుగుతుండడం వల్ల ఆకలి, దప్పికలు, నిత్యావసర సేకరణ కోసం గ్రామాల్లోకి వెళ్తున్నారు. అక్కడే వారి సహాయకులకు చెప్పి కావాల్సినవి తెప్పించుకుంటుండగా.. హ్యూమన్ ఇంటెలిజెన్స్ లభిస్తోంది. కానీ ఉగ్రవాదులు ఈ విషయాన్ని ముందుగానే పసిగడుతూ.. చాలా జాగ్రత్తగా తప్పించుకోగల్గుతున్నారు. కానీ భద్రతా బలగాలు మాత్రం ముష్కరులను కచ్చితంగా పట్టుకుని పగ తీర్చుకుంటామని చెప్పుకొస్తున్నారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa