ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 05:56 PM

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినందుకు కృతజ్ఞతగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు తిరుమలలో శ్రీవారికి.. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు. తన కుమారుడు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడాలని ప్రార్థించిన అభిమానులకు, జనసైనికులకు, శ్రేయోభిలాషులకు, సినీ పరిశ్రమలోని వారికి .. ఇతర మద్దతుదారులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తిరుమల వెళ్లనున్నారు. రేపు ఉదయం ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో వారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. కుమారుడు క్షేమంగా బయటపడటంతో.. తల్లిగా తన మొక్కును తీర్చుకునేందుకు అన్నాలెజినోవా తిరుమల వెళ్లనున్నారు.


ఏప్రిల్ 8వ తేదీన సింగపూర్ నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న రివర్ వ్యాలీ రోడ్డులో గల ఒక మూడంతస్తుల భవనంలో టమాటో కుకింగ్ స్కూల్ ఉంది. మార్క్ శంకర్ ఆ పాఠశాలలో సమ్మర్ క్యాంప్‌కు హాజరయ్యాడు. ఆ సమయంలో అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మార్క్‌తో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా గాయపడ్డారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, దట్టమైన పొగ కారణంగా మార్క్‌కు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది తలెత్తింది. అలాగే, స్వల్పంగా చేతులు మరియు కాళ్లకు గాయాలయ్యాయి.


హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. భారతీయ సినిమాకు ‘రాజాసాబ్’ మన ప్రభాస్


ఈ విషయం తెలిసిన వెంటనే, అల్లూరి జిల్లాలో 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన తన పర్యటనను ముగించుకుని విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. సింగపూర్‌లోని ఆసుపత్రికి చేరుకున్న పవన్, కుమారుడిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి మార్క్‌కు మానసిక ధైర్యాన్నిచ్చారు. కుమారుడు పూర్తిగా కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ దంపతులు మార్క్‌తో కలిసి తిరిగి భారతదేశానికి చేరుకున్నారు.


తన కుమారుడు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడాలని ప్రార్థించిన అభిమానులకు, జనసైనికులకు, శ్రేయోభిలాషులకు, సినీ పరిశ్రమలోని వారికి మరియు ఇతర మద్దతుదారులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సింగపూర్ అధికారులు అందించిన సహాయాన్ని కూడా ఆయన కొనియాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com