ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సడెన్ షాకిచ్చిన ఎస్‌బీఐ. .. ఏప్రిల్ 15 నుంచే అమలులోకి

business |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 10:34 PM

ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లకు సడెన్ షాకిచ్చింది. ఇటీవలే అధిక వడ్డీ రేట్లు కల్పించే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్‌ను నిలిపివేసిన ఎస్‌బీఐ ఇప్పుడు మరో షాకివ్వడం గమనార్హం. ఎంపిక చేసిన వివిధ టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను ఏప్రిల్ 15, 2025 నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


సురక్షితమైన, స్థిరమైన వడ్డీ కోరుకునే వారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. బ్యాంకులు సైతం వివిధ టెన్యూర్ల ద్వారా మంచి వడ్డీ రేట్లు కల్పిస్తుంటాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఇటీవలే రెపో రేటును పావు శాతం మేర కోత పెట్టింది. దీంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు తగ్గించగా ఇప్పుడు దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ సైతం అదే దారిలో నడిచింది. వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3.5 శాతం నుంచి 6.90 శాతం వరకు వడ్డీ రేట్లు కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 4 శాతం నుంచి 7.40 శాతం వడ్డీ ఇస్తోంది. అత్యధిక వడ్డీ రేటు 2- 3 ఏళ్ల టెన్యూర్ పై కల్పిస్తోంది.


ఎస్‌బీఐ లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లు..


7 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ అందిస్తోంది.


46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ ఇస్తోంది.


180 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.


211 రోజుల నుంచి 1 సంవత్సరంలోపు డిపాజిట్లపై బ్యాంకు 6.50 శాతం వడ్డీ కల్పిస్తోంది.


1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లోపు ఉండే డిపాజిట్లపై 6.70 శాతం మేర వడ్డీ అందిస్తుంది.


2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లోపు డిపాజిట్లపై 6.90 శాతం ఆఫర్ చేస్తోంది.


3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లోపు డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ ఇస్తోంది.


5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లోపు డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ కల్పిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com