ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా పొమ్మంటుంటే దక్షిణ కొరియా రమ్మంటోంది

international |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 11:22 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి అక్కడే చదువుకుంటున్న, స్థిరపడాలనుకునే వారికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసా గడువు ముగిస్తే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండనీయకుండా, గ్రీన్ కార్డులు వెంటనే అందజేయకుండా చుక్కలు చూపిస్తున్నారు. దీంతో అనేక మంది తిరిగి ఇండియా వచ్చేస్తున్నారు. యూఎస్ వెళ్లాలి అనుకునే వారు కూడా ఆ ఆలోచన మానుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే అన్నట్లుగా దక్షిణ కొరియా ఓ సరికొత్త వీసాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా చదువకునేందుకే కాకుండా అక్కడే స్థిరపడాలనుకునే వారి కోసం టాప్ టైర్ వీసాను అందిస్తోంది. మరి దీని వల్ల కల్గే ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పర్యాటకుల మనసు దోస్తున్న దేశాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటి. అద్భుతమైన ప్రకృతి అందాలు, రుచికరమైన వంటకాలతో అక్కడికెళ్లే వారికి మస్తు మజానిచ్చే ఈ దేశానికి వెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రజలంతా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కేవలం పర్యాటకులను మాత్రమే కాకుండా అక్కడికి వచ్చి చదువుకునేందుకు, అక్కడే స్థిరపడాలనుకునే వారి కోసం దక్షిణ కొరియా అద్భుతమైన అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా అమెరికా దేశం వదిలి వెళ్లిపోవాలని చెబుతున్న సమయంలోనే దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది. ఉన్నత చదువులు చదివి, అద్భుతమైన నైపుణ్యం ఉంటే.. తమ దేశానికి వచ్చి కోట్లు సంపాదించుకోమని, కావాలంటే అక్కడే స్థిరపడమని వివరిస్తోంది.


ఇందుకోసం దక్షిణ కొరియా టాప్ టైర్ వీసాను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ వీసాను అందజేస్తుండగా.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన టెక్ నిపుణులకు అక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు మార్గం సుగమం చేసింది. నూతన ఆవిష్కరణలకు తోడ్పడే సీనియర్ ఇంజినీర్లు సహా వారి కుటుంబాలకు దీర్ఘకాలిక రెసిడెన్స్ పర్మిట్‌కు అవకాశం కల్పించే ఎఫ్-2 వీసాను అందజేస్తోంది. అయితే ప్రపంచ టాప్ 100 యూనివర్సిటీల్లో ఏదో ఒక సబ్జెక్టులో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేసిన వారు ఇందుకు అర్హులు. వీరు మాత్రమే కాకుండా టాప్ గ్లోబల్ కంపెనీల్లో కనీసం 8 ఏళ్లు పని చేసిన వారికి కూడా ఎఫ్-2 వీసాలను అందిస్తోంది.


అయితే దరఖాస్తుదారులు కనీసం రూ.88.6 లక్షల వార్షిక వేతనాన్ని అందుకోవాలి. అలాగే రూ.1.2 కోట్ల వార్షిక వేతనం అందుకునే వారికి విద్య, పని అనుభవం వంటి అర్హతల్లో సడలింపు కూడా ఉంటుంది. ఈ వీసా ద్వారా గ్లోబల్ టెక్ సంస్థల్లో పని చేస్తున్న కనీసం 1000 మంది సీనియర్ ఇంజినీర్లను తమ దేశం రప్పించుకోవాలని దక్షిణ కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ అవకాశాన్ని ఎంత మంది ఉపయోగించకుంటారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com