నిండు వేసవి కాలంలోకి వచ్చేశాం. ఏప్రిల్ నెల రెండు వారాలు అయిపోయాయి. ఈ క్రమంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్య భగవానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి భయటకు రాలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. అప్పుడప్పుడు వర్షం పలకరిస్తున్నా ఎండల దాటికి తట్టుకోలేని పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కండీషనర్లు (ఏసీ)ల వినియోగం భారీగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో 24 గంటలు ఏసీలు వాడాల్సి వస్తోందని, దీంతో కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతోందని ఆందోళన చెందుతున్నారు. ఏసీ వాడకంలో లేని వారికి వందల్లో వచ్చిన కరెంట్ బిల్ ఇప్పుడు వేలల్లో వస్తోంది. అయితే ఏసీ వాడుతూనే కరెంట్ బిల్ పెరగకుండా చూసుకోవచ్చు. అది ఎలాంగో తెలుసుకుందాం.
1.సరైన ఉష్ణోగ్రత సెట్ చేయాలి..
ఏసీ వినియోగిస్తున్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సెట్ చేయకూడదు. చాలా మంది 16 డిగ్రీల స్థాయిలో పెడుతుంటారు. ఇలా చేస్తే త్వరగా గది చల్లబడుతుందనుకుంటారు. కానీ, అది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ లెక్కల ప్రకారం.. మన శరీరానికి 24 డిగ్రీల ఉష్ణోగ్రత సరైనది. ఈ స్థాయిలో ఏసీ అనేది సెట్ చేసుకోవాలి. దాంతో లోడ్ పడదు. 24 డిగ్రీల స్థాయిలో ఉండడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది. బిల్ తగ్గిపోతుంది.
2.పవర్ బట్ ఆఫ్ చేయాలి
ఎలక్ట్రికల్ వస్తువులు ఉపయోగించనప్పుడు పవర్ బటన్ ఆఫ్ చేసి ఉంచాలి. చాలా మంది ఏసీలను రిమోట్తో ఆఫ్ చేస్తారు. అది సరైన పద్ధతి కాదు. అలా చేస్తే కంప్రెసర్ ఐడియల్ లోడ్ మోడ్ కి వెళ్తుంది. అప్పుడు సైతం పవర్ వినియోగిస్తుంది. దీంతో మీకు తెలియకుండానే బిల్ పెరిగిపోతుంది.
3.టైమర్ సెట్ చేయడం మంచిది
ఏసీల్లో టైమర్ ఉంటుంది. రాత్రంతా ఏసీ ఉపయోగించకుండా ఒక టైమ్ ఉపయోగిస్తే భారీగా పవర్ ఆదా చేయొచ్చు. పడుకునే ముందు నుంచి 2- 3 గంటల వరకు ఏసీ టైమ్ సెట్ చేయాలి. ఆ సమయం తర్వాత ఏసీ ఆటోమేటిక్ గా ఆగిపోయి కరెంట్ ఆదా అవుతుంది. మీ బిల్లూ తగ్గిపోతుంది.
4.తరుచుగా సర్వీసింగ్ చేయించాలి
ఏ వస్తువైనా మెరుగైన పని తీరు ఉండాలంటే ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి. ఏసీలను సైతం సర్వీసింగ్ చేయిస్తే సరైన విధంగా పని చేస్తాయి. చాలా కంపెనీ ఏసీలను త్వరగా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉండదంటూ చెబుతాయి. కానీ, అది నిజం కాకపోవచ్చు. చాలా మంది కేవలం ఎండా కాలంలోనే ఏసీలు ఉపయోగిస్తారు. అందుకే సర్వీసింగ్ తప్పనిసరి అవసరం. దుమ్ము, ఇతర పార్టికల్స్ ఉంటే ఏసీని పనితీరును దెబ్బతీస్తాయి. దీంతో కరెంట్ బిల్ భారీగా పెరిగుతుంది.
5.ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి.
ఏసీ ఆన్ చేసే కన్నా ముందే ఇంటి తలుపులు, కిటికీలు మూయాలి. ఓసారి చెక్ చేయాలి. గదిలోకి బయటి గాలి రాకుండా చూసుకోవాలి. దీంతో గది త్వరగా చల్లబడుతుంది. ఏసీపై లోడ్ తగ్గి కరెంట్ బిల్ తగ్గుతుంది.
![]() |
![]() |