ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 07:52 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విడదల రజినికి 41ఏ కింద నోటీసులు అందించి విచారించాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు సహకరించాలని విడదల రజినికి సూచించింది. కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. విడదల రజిని పీఏ రామకృష్ణకు కూడా 41ఏ కింద నోటీసులు ఇచ్చి, ప్రశ్నించాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేశారంటూ విడదల రజినిపై కేసు నమోదైంది. లక్ష్మీ స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారంటూ విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ విడదల రజిని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో విడదల రజిని పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. 41ఏ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే విడదల రజినిని విచారించాలని పోలీసులను ఆదేశించింది.


మరోవైపు వైసీపీ హయాంలో విజిలెన్స్‌ తనిఖీల పేరుతో తనను బెదిరించారని.. తన నుంచి అక్రమంగా రూ.2.20 కోట్లు వసూలు చేశారని పల్నాడు జిల్లాలోని యడ్లపాడులో ఉన్న లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్ యజమాని నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాలపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే విడదల రజిని మరిది విడదల గోపీని ఈ కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గోపీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం.. రిమాండ్‌కు తరలించారు.


మరోవైపు విడదల గోపి కూడా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్పోజ్ చేసింది. విడదల గోపిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు శుక్రవారం కోర్టుకు తెలియజేశారు. దీంతో విడదల గోపి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్పోజ్ చేసింది. విడదల రజినిని 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com