భారతీయ వైమానికి దళానికి చెందిన ఓ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోగా.. ఆయన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి పోషించిన సవతి తల్లి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ సవతి తల్లి కావడంతో.. ఐఏఎఫ్ పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం షాకింగ్ కామెంట్లు చేసింది. సవతి తల్లి అయినంత మాత్రానా పెన్షన్ ఇవ్వకూడదా అంటూ న్యాయస్థానం ఐఏఎఫ్ను ప్రశ్నించింది. భారత వైమానిక దళంలో ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోనున్నట్లు పేర్కొంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జయశ్రీ అనే ఓ మహిళ.. ఓ వ్యక్తికి రెండో భార్యగా వెళ్లారు. అతడి మొదటి భార్య చనిపోగా.. కుమారుడు కోసం ఆయన ఈ పెళ్లి చేసుకున్నారు. అయితే జయశ్రీ కూడా ఆ బాబును ప్రాణంగా చూసుకుని పెంచారు. తల్లిగా ప్రేమను అందిస్తూ.. అతడు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే అతడు కూడా బాగా చదివి భారత నౌకా దళంలో ఉద్యోగం సంపాదించారు. కొన్నేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. కానీ దురదృష్ట వశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగంలో ఉండగానే చనిపోవడంతో.. ఆ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ కోసం జయశ్రీ దరఖాస్తు చేసుకున్నారు.
కానీ ఐఏఎఫ్ మాత్రం జయశ్రీ సవతి తల్లి కావడంతో పెన్షన్ ఇవ్వమని చెప్పింది. దీంతో ఆమె 2021లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునఫ్లో కేసు దాఖలు చేశారు. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈక్రమంలోనే సవతి తల్లి అనే ఒకే కారణంతో పెన్షన్ ఇవ్వకపోవడం సరికాదని చెప్పింది. అలాగే భారతీయ వైమానిక దళంలో ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోనున్నట్లు జస్టిస్ సూర్య కాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
తల్లి అనే పదానికి విశాలమైన అర్థం ఉందని చెప్పుకొచ్చింది. ఈరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో జరుగుతున్నాయని.. కన్నతల్లి ఒక్కరే పిల్లల్ని పెంచడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కన్నతల్లి చనిపోయినప్పుడు సవతి తల్లి కూడా పిల్లల్ని ప్రేమగా పెంచగల్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ఆమె కూడా తల్లే కదా అని జస్టిస్ సూర్యకాంత్ ఐఏఎఫ్ అధికారులను ప్రశ్నించారు. ఈక్రమంలోనే ఈ కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు.
![]() |
![]() |