ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందంటూ ఆ సంస్థ ఉద్యోగినని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టుపై జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని, పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు.జొమాటోలో పని వాతావరణం ఏమాత్రం బాగోలేదని, పోటీ సంస్థలైన జెప్టో కేఫ్, స్విగ్గీలతో పోలిస్తే జొమాటో మార్కెట్ వాటాను కోల్పోతోందని సదరు అజ్ఞాత ఉద్యోగి తన పోస్టులో ఆరోపించారు. ఉద్యోగులు నెలకు కనీసం ఏడు ఆర్డర్లు జొమాటో యాప్లో చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, దీనిని పర్యవేక్షించడానికి ప్రత్యేక యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఫుడ్ డెలివరీ విభాగం సీఈఓ రాకేష్ రంజన్ ఆకస్మికంగా వైదొలగడం కూడా సంస్థలోని సమస్యలకు నిదర్శనమని ఆ పోస్టులో తెలిపారు.ఈ ఆరోపణలపై సీఈఓ దీపిందర్ గోయల్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. "ఇవన్నీ పూర్తిగా అర్ధరహితం. మేము మార్కెట్ వాటా కోల్పోవడం లేదు. మా ఉద్యోగులను జొమాటోలో ఆర్డర్ చేయమని ఎప్పటికీ బలవంతం చేయం. ఎంపిక చేసుకునే స్వేచ్ఛకు మేము కట్టుబడి ఉన్నాం" అని స్పష్టం చేశారు. చాలామంది ఈ విషయంపై తనను సంప్రదించడంతో స్పష్టత ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వివరణ ఇస్తున్నానని గోయల్ పేర్కొన్నారు.కాగా, రాకేష్ రంజన్ రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలను జొమాటో ఇప్పటికే ఖండించింది. ఆయన నాయకత్వ బృందంలో కొనసాగుతున్నారని, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా నాయకత్వ మార్పులు సహజమని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa