ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు టర్కీ ఫుల్ సపోర్ట్.,, అదిరిపోయే ఎలివేషన్ల వెనుక అసలు నిజం

international |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:52 PM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతోపాటు.. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసి.. వారు ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైతం ప్రతీకార చర్యలు తీసుకుంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. దీంతో ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చని భావిస్తోన్న పాక్.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ యుద్ధానికి సన్నద్ధం అవుతోంది. ప్రపంచ దేశాలన్ని పహల్గాం ఉగ్రదాడిని ఖండించగా.. టర్కీ, చైనా మాత్రం పాక్‌కు అండగా నిలుస్తున్నాయి. భారత్ దాడి చేస్తుందనే భయంతో.. పాక్ తన మిత్ర దేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటుందని.. అందులో భాగంగా టర్కీ సాయం కోరిందని వార్తలు వస్తున్నాయి.


ఇంగ్లీష్ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం.. ఒక టర్కిష్ సీ-130ఈ హెర్క్యులస్ విమానం కరాచీలో దిగినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో టర్కీ పాకిస్థాన్‌కు మిలటరీ కార్గోను తరలించినట్లు సమాచారం. ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ట్రాకర్లు ప్రచురించిన విమాన ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ నివేదికలు వెలువడ్డాయి. ఈ విమానం ఏప్రిల్ 28న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.


ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. పహల్గాం ఉగ్రదాడి రోజు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అంకారాలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశంలో ఉన్నారు. పాకిస్థాన్‌కు సాయం చేసే దేశాల్లో టర్కీ ఒకటి. ఇది ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌కు సాయం చేసేందుకు మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను పంపిందని వార్తలొచ్చాయి.


అయితే టర్కీ అధ్యక్ష కార్యాలయ సమాచార విభాగం మాత్రం ఈ వార్తలను ఖండించింది. "టర్కీకి చెందిన ఒక కార్గో విమానం ఇంధనం నింపుకోవడం కోసం పాకిస్థాన్‌లో దిగింది. ఆ తర్వాత అది తన గమ్యస్థానానికి వెళ్లిపోయింది" అని చెప్పుకొచ్చింది. టర్కీ పాకిస్థాన్‌కు మిలటరీ కార్గోను డెలివరీ చేస్తోందనే వార్తలు, చైనా పీఎల్-15 లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను పాకిస్థాన్‌కు సరఫరా చేసిందనే వార్తల తర్వాత వచ్చాయి. టర్కీ ఈ వార్తలను ఖండించగా.. డ్రాగన్ మాత్రం స్పందించలేదు.


వీటితో పాటు.. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. టర్కీకి చెందిన భారీ నౌక ఒకటి ఆయుధ సంపత్తితో కరాచీ తీరానికి చేరుకున్నట్లుగా వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో 2023 నాటిదని తేలింది. టర్కీ 100వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా.. ఇరు దేశాల మధ్య జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ సందర్భంగా తీసిన వీడియో ఇది. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాకిస్థాన్‌కు టర్కీ మద్దతుందని.. ఆ దేశం నుంచి ఆయుధాలు కూడా వచ్చాయన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ టర్కీ మాత్రం తాము పాకిస్థాన్‌కు ఎలాంటి ఆయుధాలు పంపలేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com