ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా అయిందేంటి,,,బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్..

business |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:57 PM

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 2025 ప్రారంభం నుంచి చూస్తే ఏకంగా 25 శాతం పెరిగి, త్వరలోనే మరోసారి రూ. 1,00,000 మార్కును తాకేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల కిందట 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. లక్ష మార్కు దాటి మళ్లీ దిగువకు చేరింది ఈ నేపథ్యంలో, జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 15 శాతం.. తగ్గి 118.1 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి బుధవారం తెలిపింది. అయితే, ధరలు పెరగడంతో విలువ మాత్రం 22 శాతం వృద్ధితో రూ. 94,030 కోట్లకు చేరుకుంది. డబ్ల్యూజీసీ అంచనా ప్రకారం, 2025లో భారతదేశంలో బంగారం డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉండవచ్చు.


ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారుల కొనుగోలు సరళిపై ప్రభావం పడింది. అయినప్పటికీ, అక్షయ తృతీయ సహా రాబోయే వివాహాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంగారం సాంస్కృతిక ప్రాముఖ్యత.. కొనుగోలు సెంటిమెంట్‌ను కొనసాగిస్తోందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ త్రైమాసిక నివేదికలో తెలిపారు.


నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అక్షయ తృతీయ సందర్భంగా బంగారం మార్కెట్ ఉత్సాహంగా ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా పెరుగుతాయి. రికార్డు స్థాయి ధరల కారణంగా వినియోగదారులు చిన్న, తేలికపాటి ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు ధరలు తగ్గుతాయనే ఆశతో కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. అయినప్పటికీ, వివాహ సంబంధిత డిమాండ్ దాని ప్రాముఖ్యత దృష్ట్యా సాపేక్షంగా స్థిరంగానే ఉంది.


ప్రస్తుత ధరల స్థాయి కొంతమందిని కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించేలా చేసినప్పటికీ, అక్షయ తృతీయ సమయంలో బంగారం సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇంకా నమ్మకమైన ఆస్తిగా దాని హోదా కొనుగోళ్లలో ఊపును కొనసాగిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. అయితే, పెట్టుబడి డిమాండ్ మాత్రం 7 శాతం పెరిగి 46.7 టన్నులకు చేరుకుంది. ఇది గతేడాది ఇదే కాలంలో 43.6 టన్నులుగా ఉంది. ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, సురక్షితమైన ఆస్తిగా బంగారం పాత్ర మరింత స్పష్టంగా కనిపించింది. ఇది బంగారు కడ్డీలు, నాణేల డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది.


మరోవైపు, 2025 క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 25 శాతం తగ్గి 71.4 టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో 95.5 టన్నులుగా ఉంది. 2020 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. అయితే, విలువ పరంగా చూస్తే ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగింది. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులకు చేరుకుంది. రికార్డు స్థాయి ధరల కారణంగా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడానికి వెనుకాడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com