ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ కలిసి డిన్నర్ చేయాలి.. డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 08:55 PM

పహల్గా్మ్ ఉగ్రదాడి.. దానికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి అదే పాట పాడారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా-సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో మాట్లాడుతూ భారత్, పాక్ యుద్ధం తానే ఆపినట్లు తెలిపారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని మళ్లీ చెప్పారు.


ఈ సందర్భంగా తనను తాను ట్రంప్ ఒక శాంతికర్తగా అభివర్ణించుకున్నారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను ప్రయత్నించినట్లు వెల్లడించారు. భారత్, పాక్ మధ్య తలెత్తిన ఘర్షణలు తగ్గించుకునేందుకు రెండు దేశాలు కలిసి మంచి డిన్నర్‌ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు. అంతేకాకుండా అణుక్షిపణులతో యుద్ధాలు వద్దని హితవు పలికారు. భారత్‌-పాక్ అణుయుద్ధం నివారించడానికి తాను మధ్యవర్తిత్వం వహించడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితి బాగుందని తాను అనుకుంటున్నానని.. వాళ్లని ఒకచోట చేర్చవచ్చని పేర్కొన్నారు.


అయితే ఇటీవల భారత్‌-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా చేయడంలో అమెరికా ప్రభుత్వం సక్సెస్ అయినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇందుకు రెండు దేశాలను ఒప్పించేందుకు వాణిజ్య అంశాలను ఎక్కువగా ఉపయోగించానని ట్రంప్‌ మరోసారి తెలిపారు. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని.. కొంత వ్యాపారం చేద్దామని భారత్, పాకిస్తాన్‌ దేశాలకు తాను నచ్చజెప్పినట్లు ట్రంప్ వివరించారు.


కానీ.. డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న దానికీ భారత్ చెబుతున్న దానికీ ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం విషయంలో ఇప్పటికే ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్‌ తిరస్కరించింది. భారత్, పాక్ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) కలిసి తమకు తాముగా ఒక అవగాహనకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఇంకెవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పాయి. ఇలా చెప్పిన తర్వాత కూడా మళ్లీ ట్రంప్.. భారత్, పాక్ ఉద్రిక్తతలు తగ్గించిన క్రెడిట్ తనదేనని చెప్పడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com