ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌తో ముకేశ్ అంబానీ భేటీ

business |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 11:34 PM

 ఆసియా కుబేరుడు, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ.. దోహాలో కీలక భేటీలకు సిద్ధమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముకేశ్ అంబానీ.. బుధవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ ఎమిర్‌ను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీ రిలయన్స్ సంస్థ ప్రపంచంలోని కీలక నాయకులతో కొనసాగిస్తున్న సంబంధాలకు నిదర్శనమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్ సంస్థ.. అమెరికా, ఖతార్‌లోని ముఖ్యమైన వ్యక్తులతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతోంది.


గత కొన్ని సంవత్సరాలుగా ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్- ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రిలయన్స్ వ్యాపారాలలో అనేక పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు, ముకేశ్ అంబానీ.. గూగుల్, మెటా వంటి ప్రముఖ అమెరికన్ టెక్ సంస్థలతో కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. దోహాలోని లుసైల్ ప్యాలెస్‌లో ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక విందులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఎలాంటి అధికారిక వ్యాపార లేదా పెట్టుబడి చర్చలు జరిగే అవకాశం లేదని ఏర్పాట్లపై ప్రత్యక్ష అవగాహన ఉన్న ఒక వర్గం తెలిపింది.


ట్రంప్, ఖతార్ నాయకత్వాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన లండన్ బేస్డ్ భారతీయ సంతతి వ్యాపారవేత్త కూడా ఈ సమావేశానికి హాజరవుతారని మరో వర్గం ధ్రువీకరించింది. అయితే, ఆ వ్యక్తి వివరాలను మాత్రం రెండు వర్గాలు వెల్లడించలేదు. ముకేశ్ అంబానీ పూర్తి ట్రావెల్ ప్లాన్ షెడ్యూల్ ఇంకా తెలియరాలేదు.


ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన తర్వాత ఈ సమావేశం జరుగుతోంది. ఆ సమయంలో ఖతార్ వివిధ భారతీయ రంగాలలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఖతార్‌లో తన కార్యక్రమాలు ముగిసిన తర్వాత, ట్రంప్ గురువారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన పర్యటన ప్రాంతీయ భద్రతా సమస్యల కంటే పెట్టుబడి కార్యక్రమాలపై దృష్టి సారిస్తుందని సమాచారం.


మొత్తానికి, ముకేశ్ అంబానీ ఈ కీలక భేటీ వెనుక అసలు కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. రిలయన్స్ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందా? లేక మరేదైనా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోందా? ఈ భేటీలో ఎలాంటి చర్చలు జరుగుతాయో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com