ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండేళ్ల క్రితం జట్టు నుంచి తీసేశారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌నే చేశారు

sports |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 08:49 PM

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌గా 33 ఏళ్ల రోస్టన్ ఛేజ్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే రెండేళ్ల క్రితం ఇదే ఆటగాడిని వెస్టిండీస్ బోర్డు టెస్టు టీమ్‌ నుంచి తప్పించింది. అప్పటి నుంచి అతడు సుదీర్ఘఫార్మాట్‌లో మ్యాచ్ ఆడలేదు. కానీ అనూహ్యంగా అతడికే సారథ్య బాధ్యతలు అప్పగించి అందర్నీ షాక్ చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.


నిజానికి వెస్టిండీస్ టెస్టు కెప్టెన్‌గా క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఉండేవాడు. అతడి సారథ్యంలో వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆ తర్వాత అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. రెండు నెలల పాటు కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేసిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. ఎట్టకేలకు సారథిని ప్రకటించింది.


జూన్‌లో వెస్టిండీస్- ఆస్ట్రేలియా జట్ల మధ్య వెస్టిండీస్ వేదికగా 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-2027 సైకిల్‌ ఈ సిరీస్‌తోనే ఇరు జట్లూ ప్రారంభించనున్నాయి. ఈ మ్యాచ్‌ ద్వారా రోస్టన్ ఛేజ్.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో కేవలం సాధారణ ఆటగాడిగా ఉన్న అతడు.. ఈసారి మాత్రం సారథిగా బరిలోకి దిగనున్నాడు. జోమెల్ వారికన్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్ టీ20, వన్డే జట్లకు షై హోమ్ సారథిగా ఉన్నాడు. అతడికే టెస్టు పగ్గాలు అప్పగించాలని భావించినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై మరింత ఫోకస్ చేసేందుకు అతడు ఈ ఆఫర్‌ను తిరస్కరించాడు!


రోస్టన్ ఛేజ్ 2016 సంవత్సరంలో వెస్టిండీస్ తరపున టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసాడు. అతడు తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 11 మార్చి 2023న దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 28 రన్స్ చేసిన ఈ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు. ఛేజ్ ఇప్పటివరకు వెస్టిండీస్ తరపున 49 టెస్టులు ఆడాడు. 2,265 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 85 వికెట్లు తీసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com