ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్ వివరాలు లీక్, ఇద్దరు యువకుల అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:47 PM

దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న మరో గూఢచార నెట్‌వర్క్‌ను పోలీసులు పట్టుకున్నారు. పాకిస్థాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేశారని పోలీసులు వారిని అరెస్టు చేశారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లో భారత దేశ సైనికుల కదలికలు, కీలకమైన వ్యూహాత్మక ప్రదేశాల సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు అందించినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు ఈ సమాచారాన్ని లీక్ చేశారని వెల్లడించారు. వారిని పంజాబ్‌ గురుదాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌గా గుర్తించారు.


19 నుంచి 20 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు యువకులు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలతో పాటు సైనికుల సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేశారు. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా వారి మొబైల్ ఫోన్లు పరిశీలించగా పాక్‌కు గూఢచర్యం వహిస్తున్నట్లు నిర్ధారణ అయినట్లు పంజాబ్ పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. మూడు ఫోన్లు, ఎనిమిది లైవ్ కాట్రిడ్జ్‌లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. వారి బ్యాంకు ఖాతాలకు లక్ష రూపాయలు బదిలీ అయినట్లు కూడా అధికారులు గుర్తించారు.


గత 20 రోజులుగా పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారని తెలిపారు. గురుదాస్‌పూర్‌ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సదరు యవకులు ఇద్దరు డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని అన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.


ఇప్పటికే.. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న కేసులో హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడికి 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు అధికారులు చెబుతున్నారు.


ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించిందని, ఒకసారి చైనాకు కూడా వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. "ట్రావెల్ విత్ జో" అనే పేరుతో ఆమె యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com