ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగాలు పోతాయంటూ..సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు శ్రీధర్ వేంబు వార్నింగ్

business |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 11:58 PM

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం, ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ. ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ కొట్టడమే లక్ష్యంగా యువత ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కృత్రిమ మేధ  రాకతో ఈ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో  సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ శ్రీధర్ వేంబు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వారు పొందుతున్న భారీ వేతనాలు శాశ్వతం కాదని, ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు.


శ్రీధర్ వేంబు తన అభిప్రాయాలను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మెకానికల్, సివిల్ ఇంజనీర్లు, కెమిస్టులు లేదా ఉపాధ్యాయుల కంటే ఎక్కువ జీతాలు పొందడం అనేది వారి జన్మహక్కు కాదు. ఇది శాశ్వతంగా ఉంటుందని భావించడం పొరపాటు. కస్టమర్లు మన ఉత్పత్తులకు డబ్బు చెల్లిస్తున్నారన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. పరిశ్రమలో నిరంతర ఆవిష్కరణలు, వినయం ఎంతో అవసరం" అని ఆయన సూచించారు.


  ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, కొత్త డెవలప్‌మెంట్ టూల్స్ కారణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో ఉత్పాదకత విప్లవం రాబోతోందని వేంబు హెచ్చరించారు. ఇది అనేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను నాశనం చేయగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అవసరమని, మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇంజినీర్లకు హితవు పలికారు. "మనం కూడా మార్పులకు గురవుతామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా జరగదని మనం ఎంత ఎక్కువగా భావిస్తే, అంత ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా ఇంటెల్ మాజీ సీఈఓ ఆండీ గ్రోవ్ చెప్పిన "అప్రమత్తంగా ఉండేవారే మనుగడ సాగిస్తారు" అనే మాటలను శ్రీధర్ వేంబు గుర్తు చేశారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో నిపుణులు, కంపెనీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుందన్నారు.


శ్రీధర్ వేంబు ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన టెక్నాలజీ పరిశ్రమలో తన వినూత్న ఆలోచనలకు, ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథానికి ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఆయన జోహోలో కీలకమైన వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి, శ్రీధర్ వేంబు చేసిన ఈ వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో కొంత కలవరం సృష్టించాయి. అయితే, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భవిష్యత్తులోనూ అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com