ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఇస్లాం జనాభా.. నాలుగో స్థానంలో హిందూమతం

international |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 08:28 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల గురించి ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం తాజాగా విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలను వెల్లడించింది. ఇస్లాం మతం అత్యంత వేగంగా విస్తరిస్తోందని తెలిపింది. 2010-2020 మధ్య 10 ఏళ్ల కాలంలో ప్రపంచంలో ముస్లిం జనాభా ఏకంగా 34.7 కోట్లు పెరిగి 200 కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే క్రైస్తవం అతిపెద్ద మతంగా కొనసాగుతోందని వివరించింది. మరోవైపు.. క్రైస్తవ మతం ఇప్పటికీ అతిపెద్ద మతం అయినప్పటికీ దాని వాటా క్రమంగా తగ్గుతోందని స్పష్టం చేసింది. ఇక ప్రపంచ జనాభాలో 14.9 శాతంతో హిందూ మతం నాలుగో స్థానంలో స్థిరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఏ మతంతోనూ సంబంధం లేని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక వెల్లడించింది. 2010 నుంచి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా మత జనాభాలో జరిగిన మార్పులను విశ్లేషించేందుకు ప్యూ రీసెర్చ్ సెంటర్ ఒక నివేదికను తయారు చేసి విడుదల చేసింది. ఇందులో కీలకమైన విషయాలను హైలైట్ చేసింది.


వేగంగా పెరుగుతున్న ఇస్లాం జనాభా


ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. ముస్లిం జనాభా 2010 నుంచి 2020 వరకు ఏకంగా 347 మిలియన్లు (34.7 కోట్లు) పెరిగి.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఈ పెరుగుదల అనేది ప్రపంచంలోని ఇతర మతాలు అన్నింటినీ కలిపి చూసినా ఎక్కువగా వృద్ధి చెందినట్లు తెలిపింది. ముస్లిం జనాభా ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం అధిక జనన రేటుతోపాటు యువ జనాభా అని తేల్చింది. అయితే ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి మత మార్పిడులు మాత్రం ఈ పెరుగుదలకు పెద్దగా దోహదపడలేదని ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. 2060 నాటికి ఇస్లాం మతం.. క్రైస్తవ మతాన్ని దాటేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.


 ఇక అన్ని మతాల్లో కెల్లా హిందూ మతం జనాభా స్థిరంగా అభివృద్ధి చెందుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచ జనాభా వృద్ధి రేటుతో దాదాపు సమానంగా హిందూ జనాభా పెరిగినట్లు తెలిపింది. 2010 నుంచి 2020 వరకు 10 ఏళ్లలో హిందూ జనాభా 126 మిలియన్లు (12.6 కోట్లు) పెరిగి.. మొత్తంగా 120 కోట్లకు చేరుకున్నట్లు వివరించింది. ప్రపంచ జనాభాలో 14.9 శాతంగా హిందువుల జనాభా స్థిరంగా ఉందని.. అదే సమయంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మతంగా నిలిచినట్లు తెలిపింది. మిడిల్ ఈస్ట్-ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి హిందువులు వలస వెళ్లడంతో.. అక్కడ వారి జనాభా 2010-2020 మధ్య 62 శాతం పెరిగినట్లు ఈ నివేదిక బయటపెట్టింది.


క్రైస్తవ మతం వాటాలో తగ్గుదల


ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇప్పటికీ క్రైస్తవ మతం నిలిచింది. అయినప్పటికీ.. క్రైస్తవ మతం వాటా తగ్గుతోందని నివేదిక తెలిపింది. క్రైస్తవ మతం 230 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ.. మత మార్పిడులు, జననాల రేట్లు తక్కువగా ఉండటం వల్ల 2010 నుంచి 2020 వరకు 10 ఏళ్లలో క్రైస్తవ మతం వాటా 1.8 శాతం తగ్గినట్లు తేల్చింది. అయితే ఇదే 10 ఏళ్ల కాలంలో క్రైస్తవుల సంఖ్య 12.2 కోట్లు పెరిగినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్టు పేర్కొంది.


మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఏ మతాన్ని అనుసరించకుండా.. ఈ మతాలకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు ఆ నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచ జనాభాలో క్రైస్తవం, ముస్లిం జనాభా తర్వాత మూడో అతిపెద్ద సమూహంగా ఈ మతపరంగా ఎలాంటి సంబంధం లేని వారు ఉన్నారని తెలిపింది. ప్రపంచంలో మతపరమైన కూర్పులో జరుగుతున్న కీలక మార్పులను ఈ నివేదిక స్పష్టంగా బయటపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa