ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా అయితేనే సిలిండర్.... ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 06:20 PM

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత కలవరపెడుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. గ్యాస్ సరఫరా విషయాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న పయ్యావుల కేశవ్.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రాధాన్యం ప్రకారం తొలుత గృహ వినియోగదారులు, తర్వాత ఆస్పత్రులు, అనంతరం హాస్టళ్లలకు గ్యాస్ సరఫరా చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. గ్యాస్ కొరత ఆందోళనతో ఎక్కువమంది సిలిండర్లు బుకింగ్ చేస్తున్నారని.. అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


మరోవైపు ఎల్పీజీ గ్యాస్ పక్కదారి పట్టకుండా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఆన్‌లైన్ విధానంలోనే ఉండాలని గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు స్పష్టం చేసినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. గ్యాస్ బుకింగ్ అయిన తర్వాత ఓటీపీ ఉంటేనే సిలిండర్లు ఇస్తారని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఓటీపీ ద్వారానే డెలివరీ ఉంటుందన్నారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.


మరోవైపు రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వపరంగా ఏం చేయాలో అంతా చేయాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్యాస్ సరఫరాపై ఆధారపడిన హోటల్స్, ఇతర రంగాల వారితో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa