ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌‌కు ఆహ్వానం

international |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 08:30 PM

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌కు అమెరికా ఆహ్వానం పలికింది. అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని అగ్రరాజ్యం నుంచి ఆహ్వానం అందిది. ఈ నెల 12వ తేదీన వాషింగ్టన్ చేరుకోనున్న జనరల్ అసిమ్ మునీర్.. జూన్ 14వ తేదీన జరిగే వేడుకలకు హాజరు కానున్నారు. అయితే అసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని.. విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌పై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అదే సమయంలో చైనాతో పాకిస్తాన్ పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలపై కూడా అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా అమెరికా ఆర్మీ వార్షికోత్సవాల రోజునే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం.


అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను అమెరికాకు రప్పించుకోవడం వెనుక లోతైన వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది అనేది అర్థం అవుతోంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే పాకిస్తాన్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


ఉదయం లేవగానే ఇప్పుడు చెప్పే ఒక్క ఆసనం కాసేపు వేస్తే చాలు, బరువు తగ్గడంతో పాటు మీ పొట్ట మొత్తం క్లీన్


అమెరికా ఆర్మీడే సంబరాలకు అసిమ్ మునీర్‌ను పిలిచినప్పటికీ.. ప్రాంతీయ వ్యూహాన్ని పునఃసమీక్షించే ప్రయత్నంలో భాగంగా అమెరికా చూస్తున్నట్లు తెలుస్తోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్), బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) వంటి ప్రాజెక్టుల ద్వారా చైనా, పాకిస్తాన్ మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు పటిష్ఠం అవుతున్న వేళ.. దీనిపై అమెరికా ఆందోళన చెందుతున్నట్లు అర్థం అవుతోంది. లిథియం, రాగి, బంగారం వంటి అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో పాకిస్తాన్ విదేశీ పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది. ఇది చైనా అధిక లీవరేజ్ పెట్టుబడి నమూనాను పునరావృతం చేయడానికి జాగ్రత్తపడుతోందని.. ఇది పెరుగుతున్న పాకిస్తాన్ రుణ భారాన్ని గణనీయంగా పెంచింది.


ఇక మే 14వ తేదీన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్తాన్‌కు 1.023 బిలియన్ డాలర్లను విడుదల చేసింది. ఇక పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ ఈనెల 10వ తేదీన 2025–26 ఆర్థిక సంవత్సరం కోసం జాతీయ బడ్జెట్‌ను సమర్పించారు. ఇందులో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌ను 2.55 ట్రిలియన్ పాకిస్తాన్ రూపాయలు అంటే (అమెరికా కరెన్సీలో ఏకంగా 9 బిలియన్ డాలర్లు) కేటాయించారు. ఇది గత సంవత్సరంతో పోల్చితే 20 శాతం అధికం కావడం గమనార్హం. భారత్‌తో వివాదం పెరిగిన తర్వాత.. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ భారీగా నష్టపోయిన తర్వాత భద్రత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పాక్.. రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa