ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరేళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం.. తగ్గుతున్న ధరలు

business |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 10:50 PM

సామాన్య ప్రజలకు, ముఖ్యంగా వంటింటి బడ్జెట్‌ను ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా ఒక గొప్ప వార్త! నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన చెందుతున్న తరుణంలో, భారత ఆర్థిక వ్యవస్థ ఊరటనిచ్చే ఒక ముఖ్యమైన పరిణామం కనిపించింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడంతో, మే నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కేవలం 2.82 శాతంగా నమోదైంది. ఈ శుభవార్త.. మీ నెలవారీ ఖర్చులపై సానుకూల ప్రభావం చూపగలదు. అంటే డబ్బులు ఆదా అవుతాయని చెప్పొచ్చు.


ప్రభుత్వం గురువారం విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌లో ఇది 3.16 శాతంగా ఉండగా, గతేడాది మే నెలలో 4.8 శాతంగా ఉంది. MoSPI డేటా ప్రకారం ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా నమోదవడం ఇది వరుసగా నాలుగో నెల కావడం విశేషం. ఇక 2019 ఫిబ్రవరి తర్వాత ఇదే అతి తక్కువ.


 ఈ డేటా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి చేర్చిన కొద్ది రోజుల్లోనే వచ్చింది. ఇది వరుసగా మూడో రెపో రేటు కోత , ఇంకా ఫిబ్రవరి నుంచి వరుసగా 3 సార్లు తగ్గించగా ఈ క్రమంలోనే రెపో రేటు మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఈ చర్య.. ద్రవ్యోల్బణ నియంత్రణ నుంచి ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం వైపు ఆర్బీఐ దృష్టి సారిస్తుందని స్పష్టమైన సంకేతం ఇస్తుంది.


ఆహార ధరలు తగ్గుదల.. సామాన్యుడికి పెద్ద ఊరట!


మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 0.99 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌లో ఇది 1.78 శాతంగా ఉండగా, ఏడాది క్రితం 8.69 శాతంగా ఉంది. ఇది ఆహార ధరలలో వచ్చిన భారీ తగ్గుదలను సూచిస్తుంది. కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన 13.7 శాతం తగ్గాయి, పప్పుల ధరలు 8.22 శాతం తగ్గాయి, తృణధాన్యాల ధరలు 4.77 శాతం మేర తగ్గాయి. ఈ తగ్గింపులు సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 0.95 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 0.96 శాతంగా నమోదైంది. పాలు, ఇతర పాల ఉత్పత్తులు, వంట నూనెలు, ఆల్కహాల్ లేని పానీయాలు వంటి ముఖ్యమైన వస్తువుల్లో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది.


రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణం!


22 ప్రధాన రాష్ట్రాలలో 12 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు 2.8 శాతం కంటే తక్కువగా నమోదైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఢిల్లీ, గుజరాత్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ గణాంకాలు ఆర్బీఐకి ద్రవ్య విధానంలో కొంత వెసులుబాటును కల్పించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa