ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయేల్ దాడుల భయం.. అమెరికాలో హైఅలర్ట్

international |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 09:27 PM

ఇరాన్‌పై దాడికి ఇజ్రాయేల్ సిద్ధమవుతోందన్న అంచనాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్ అణు కార్యక్రమంపై వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు విఫలమైతే, అమెరికా అనుమతి లేకుండానే ఇజ్రాయేల్ తనంతట తానే ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయవచ్చన్న భయాలు నెలకున్నాయి. దీంతో ట్రంప్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.


ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మాట్లాడుతూ.. ‘ఇది ప్రమాదకరమైన ప్రాంతంగా మారొచ్చు’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా నుంచి, ముఖ్యంగా ఇరాన్ నుంచి అమెరికా సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నట్టు పేర్కొన్నారు.. అదే సమయంలో, అమెరికా విదేశాంగ శాఖ ఇరాక్‌లోని కొంత సిబ్బందికి స్వచ్ఛందంగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. పెంటగాన్ కూడా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి సైనిక కుటుంబాల స్వచ్ఛంద రవాణాకు అనుమతి ఇచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.


అమెరికా-ఇరాన్ అణు చర్చలు


ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించే ఒప్పందాన్ని తుది దశకు తీసుకెళ్లే అవకాశాలు సన్నగిల్లుతోన్న వేళ అమెరికా భద్రతా చర్యలు వేగవంతం చేసింది. ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం తర్వాత మరో సైనిక సంఘర్షణ తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా ఈ చర్చలు కొనసాగిస్తోంది. ‘ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేసుకోలేదు.. చాలా స్పష్టంగా చెప్పాలంటే, వాళ్లు అణు ఆయుధాన్ని పొందలేరు’ అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.


ఇజ్రాయేల్ బెదిరింపులు


అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైతే తక్షణమే ఇరాన్‌పై దాడి చేయాలని ఇజ్రాయేల్ భావిస్తోందని ఆక్సియోస్ పత్రిక నివేదించింది. ‘అణు చర్చలు విఫలం కావడం ట్రంప్‌ను నిరాశకు గురిచేసింది. ‘బిబీ (ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు నిక్ నేమ్)’కి అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు’ పత్రిక పేర్కొంది.


ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలపై ట్రంప్ ఇప్పటికే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ పోస్ట్‌తో బుధవారం మాట్లాడిన ఆయన.. ‘ఇరాన్ యురేనియం శుద్ధి ఆపేందుకు ఒప్పుకోకపోతే నేను చాలా నిరుత్సాహానికి గురవుతాను’ అని వ్యాఖ్యానించారు.


టెహ్రాన్ హెచ్చరిక


ఇజ్రాయేల్ తమపై దాడి చేస్తే, దాని వెనుక ఉన్న ప్రధాన శక్తి అయిన అమెరికాకు దుష్పరిణామాలు తప్పవని ఇరాన్ పునరుద్ఘాటించింది. బుధవారం ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదెహ్ మాట్లాడుతూ.. ‘ఇరాన్‌పై దాడులు జరిగితే, మేము అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాం’ అని హెచ్చరించారు.


అమెరికా అప్రమత్తం


ఇరాన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లోని తమ దౌత్య కార్యాలయాలన్నింటినీ అమెరికా అప్రమత్తం చేసింది.అత్యవసర చర్యల కమిటీలను ఏర్పాటు చేయాలని, భద్రతా వ్యూహాలపై నివేదికలు పంపాలని ఆదేశించింది. బహ్రెయిన్, కువైట్‌ల నుంచి కూడా స్వచ్ఛందంగా సిబ్బంది వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.


ఈ చర్యల నేపథ్యంలో విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులకు ప్రయాణ హెచ్చరికను విడుదల చేశారు. ‘జూన్ 11న, ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా అత్యవసరేతర సిబ్బందిని వెళ్ళిపోవాలని ఆదేశించాం’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాలోని ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో అమెరికాకు విస్తృత మిలిటరీ స్థావరాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa