ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదాన్ని వీడియోలో బంధించిన 17 ఏళ్ల కుర్రాడు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:38 PM

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా  విమాన ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్దార్ పటేల్ విమానాశ్రయం నుంచి జూన్ 12న మధ్యాహ్నం 1.38 గంటలకు లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. విమానం కూలుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆర్యన్ అనే 17 ఏళ్ల కుర్రాడు అనుకోకుండా ఈ వీడియోను తీశాడు. పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విమానాశ్రయానికి దగ్గరలో ఆర్యన్ కుటుంబం అద్దెకు ఉంటోంది. విమానాలు టేకాఫ్ అవుతున్నప్పుడు వీడియోలు తీయడం అతడికి అలవాటు. రోజులాగే ఎయిరిండియా విమానం ఎగురుతుంటే ఆర్యన్ తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విమానంలోని 242 మందిలో ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాయి.


  ‘వీడియో రికార్డు మొదలుపెట్టిన 14 సెకన్లకే విమానం కుప్పకూలింది. ఆ ఘటనను కళ్లారా చూసి ఎంతో భయపడ్డా. ఈ వీడియోను మొట్టమొదట నా సోదరి చూసి నాన్నకు చెప్పింది. ఆ విమానం కూలిపోతుందనే విషయం నాకు తెలియదు’ అని ఆర్యన్ చెప్పాడు. అంటే, అతడు వీడియో తీస్తున్న 14 సెకన్లలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ వణికిపోయాడు. ఇంకా తాను పూర్తిగా మానసికంగా కోలుకోలేక పోతున్నానని అన్నాడు. సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించిన సమయంలో, అది కాసేపటికే అగ్ని గోళంలా మారిపోతుందని తాను ఊహించలేదని అన్నాడు. ‘నేను వీడియో తీయడం ప్రారంభించాను, ఎందుకంటే నా స్నేహితులకు విమానం ఎలా ఎగురుతుందో చూపించాలని అనుకున్నాను... ’ అని వివరించారు. అంతేకాదు, తాను జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కబోనని అన్నాడు. కాగా, 10 నిమిషాలు ఆలస్యం వల్ల భూమి చౌహన్ అనే యువతి విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది.


ఆర్యన్ తీసిన వీడియో వైరల్ అయి, విమాన ప్రమాదానికి సంబంధించిన మొట్టమొదటి ప్రత్యక్ష దృశ్యంగా మారింది. ఆర్యన్ సోదరి మాట్లాడుతూ.. ఆ ప్రమాదం చాలా భయంకరంగా ఉండటంతో అక్కడ ఉండకూడదని ఆర్యన్ అనుకున్నాడని చెప్పింది. భయంతో సరిగ్గా మాట్లాడలేకపోయాడని కూడా ఆమె తెలిపింది.


ఇంటి యజమాని తెలిపిన ప్రకారం, ఆర్యన్ ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఏమీ తినకుండా మౌనంగా ఉండిపోయాడు. వీడియో తీసిన ఆర్యన్‌ను అరెస్టు చేశారనే వార్తల్లో నిజం లేదని పోలీసులు తెలిపారు. వీడియో తీసిన వివరాలను మాత్రమే అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఆర్యన్ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని, సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడని, ఆ తర్వాత తండ్రితోనే వెళ్లిపోయాడని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరినీ అరెస్టు చేయలేదని కూడా వివరించారు. మరోవైపు, ఓ జ్యోతిషురాలి ఆరు నెలల కిందట విమాన ప్రమాదం గురించి అంచనా వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ ప్రమాదం నుంచి భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేశ్ అనే బ్రిటిష్ సంతతి వ్యక్తి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది, అది కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్‌ భవనంలోని 30 మంది కలిసి మొత్ం 274 మంది ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa