ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో వివాదంలో చిక్కుకున్న బిహార్ మాజీ సీఎం

national |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:51 PM

బిహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రతిపక్ష ఆర్జేడీ, అధికార జేడీయూ-బీజేపీ కూటమి మధ్య ప్రతీ చిన్న విషయంలో తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న లాలూ యాదవ్.. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో చుట్టూ అలుముకున్న కొత్త వివాదంతో వార్తల్లో హైలైట్‌గా నిలిచారు. ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్ 78వ జన్మదిన వేడుకలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక ఆర్జేడీ కార్యకర్త అంబేద్కర్ ఫోటోను లాలూ కాళ్ల దగ్గర పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం తీవ్ర వివాదానికి దారితీసింది.


ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత, బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. అంబేద్కర్‌ను కించపరిచేలా లాలూ ప్రసాద్ యాదవ్ వ్యవహరించారని.. దళితులకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అవసరమైతే దేవుడి చిత్ర పటాన్ని కూడా లాలూ తన పాదాల వద్ద ఉంచుకుంటారని ఆరోపిస్తూ బీజేపీ ఈ వీడియోను షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


ఈ ఘటనపై బీజేపీ నేత, బిహార్ మంత్రి జనక్ రామ్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్త ఫోటోను కాళ్ల దగ్గర పెట్టడానికి వస్తుంటే కనీసం లాలూ ప్రసాద్ అతడిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనామిక పాశ్వాన్ విమర్శించారు. ఆ ఫోటోను తర్వాత చెత్త బుట్టలో వేశారని ఆరోపించిన ఆమె.. బిహార్‌లోని ప్రజలందరికీ వెంటనే లాలూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


మరోవైపు.. ఈ వ్యవహారంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై ఆర్జేడీ తీవ్ర స్థాయిలో మండిపడింది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. బిహార్‌ రాష్ట్రంలో ఎన్నో అంబేద్కర్ విగ్రహాలను లాలూ ప్రసాద్ యాదవ్ ఆవిష్కరించారని.. 78 ఏళ్ల వయసులో కూడా రోజుకు 10 గంటలకుపైగా పని చేస్తున్నారని తెలిపారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకాలే అని మండిపడిన తేజస్వీ.. బీజేపీ తమను ఏం చేయలేదని విమర్శించారు.


లాలూ బర్త్ డే పార్టీలో అంబేద్కర్ ఫోటో వ్యవహారంతో ఒక్కసారిగా బిహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆర్జేడీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా మారింది. లాలూ ఆరోగ్యం బాగాలేదని.. అందుకే ఆయన కుర్చీలో కూర్చున్నారని.. అది కూడా బీజేపీ నేతలకు అర్థం కావడం లేదని ఆర్జేడీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa