మనిషి జీవితం నిజంగానే ఓ నీటి బుడగ లాంటిది. మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు సంతోషంగా, సరదాగా గడిపినవారు హఠాత్తుగా కన్నుమూస్తున్న ఘటనలు అనేకం. రోడ్డు ప్రమాదాల రూపంలో, అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు రూపంలో, ఇంకొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల రూపంలో చాలా మందిని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది. తాజాగా.. హైదరాబాద్ ఎల్బీనగర్లో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఫుట్పాత్పై నిద్రిస్తున్న దంపతులు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో నిద్రలోనే కాలిబూడిదయ్యారు.
ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో ఓ ఆలయం వద్ద పడుకొని ఉన్న దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో వారికి సమీపంలో ఉన్న ఓ వీధి కుక్క కూడా విద్యుదాఘాతంతో మరణించింది. హై ఓల్టేజ్ తీగల ప్రభావంతో మృతదేహాలు పూర్తిగా కాలి, నల్లగా మాడిపోయాయి. మంటలు చెలరేగడం, మృతదేహాలు కాలిపోవడం చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. రెండు నిండు ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాతబడిన విద్యుత్ తీగలు, స్తంభాలను వెంటనే మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa