ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానం.. రెండు ప్రాణాలు బలి

Crime |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 08:37 PM

అనుమానం పెనుభూతం. ఆ భూతానికి రెండు ప్రాణాలను బలి తీసుకోవటమే కాదు.. ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చేసింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేసి.. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు పసి పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన.. విశాఖపట్నంలోని కంచరపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డికంచరపాలెంలోని వివేకానంద కాలనీలో నివాసముంటున్న నందిగామ గోపీనాథ్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. అతనికి భార్య వెంకటలక్ష్మి, 14 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే తన భార్య వేరే ఎవరితోనో చనువుగా ఉంటుదన్న అనుమానంతో గత కొంతకాలంగా గోపీనాథ్ తన భార్య వెంకటలక్ష్మితో తరచూ గొడవ పడుతున్నాడు.భర్త వేధింపులు భరించలేక వెంకటలక్ష్మి కొద్ది నెలల క్రితం తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్లో గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అయితే.. పెద్దలు నచ్చజెప్పారనో, భర్త మారాడనుకునో ఆ తర్వాత వెంకటలక్ష్మి తన కుమార్తెతో కలిసి తిరిగి భర్త వద్దకు వచ్చింది. కానీ.. కొద్దిరోజులుగా మళ్లీ భర్త వేధింపులు ఎక్కువవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే అనుమానంతో వేధిస్తున్న గోపీనాథ్.. ఇప్పుడు తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాంటూ మరింత టార్చర్ పెట్టటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే.. శుక్రవారం తెల్లవారుజామున గోపీనాథ్, వెంకటలక్ష్మి మధ్య మరోసారి గొడవ జరిగింది. కేసును వెనక్కి తీసుకోవాలని గోపీనాథ్ ఒత్తిడి చేయగా.. వెంకటలక్ష్మి తీసుకోనని తెగేసి చెప్పింది. దీంతో.. తీవ్ర కోపావేశంతో ఊగిపోయిన గోపీనాథ్.. ఇంట్లో ఉన్న డంబెల్‌తో వెంకటలక్ష్మి తల మీద పలుమార్లు బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వెంకటలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య.. మృతి చెందిందని గుర్తించి.. గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న గోపినాథ్.. ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే.. ఈ గొడవ అంతా పిల్లల ముందే జరిగింది. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గోపీనాథ్.. "అమ్మతో పడలేకపోతున్నాను. ఆమెను చంపేసి, నేను చనిపోతున్నాను. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి." అని చెప్పినట్లు పిల్లలు తెలిపినట్టు సమాచారం. పిల్లల ఏడుపులు విని ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా.. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు క్పోల్పోయారు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కుటుంబ కలహాలు, అనుమానం ఒక కుటుంబాన్ని ఎలా ఛిద్రం చేస్తాయన్నది ఈ సంఘటన మరోసారి కళ్లకు కట్టింది. కంచరపాలెం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa