ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరాయ్ కాలే ఖాన్ - మోదీపురం మధ్య నమో భారత్ రైలు ట్రయల్ రన్ సక్సెస్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:08 AM

దేశ రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న నమో భారత్ రైలు ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది. సరాయ్ కాలే ఖాన్ నుంచి మోదీపురం వరకు మొత్తం 82 కిలోమీటర్ల మార్గంలో నిర్వహించిన పూర్తిస్థాయి టైమ్‌టేబుల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్రయోగంలో రైలు గంటలోపే గమ్యస్థానానికి చేరుకోవడం విశేషం.జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ  ఇటీవల ఈ కీలక ట్రయల్ రన్‌ను నిర్వహించింది. నమో భారత్ రైళ్లు తమ గరిష్ఠ కార్యాచరణ వేగమైన గంటకు 160 కిలోమీటర్ల స్పీడుతో ఈ 82 కిలోమీటర్ల దూరాన్ని సజావుగా అధిగమించాయి. ప్రయోగ పరీక్షల సమయంలో, రైలు మార్గంలోని అన్ని స్టేషన్లలో ఆగుతూ, ఎన్‌సీఆర్‌టీసీ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గంట కంటే తక్కువ సమయంలోనే సరాయ్ కాలే ఖాన్ నుంచి మోదీపురం చేరుకుంది. ఈ ట్రయల్స్ జరుగుతున్నప్పుడే, మీరట్ మెట్రో రైళ్లు కూడా నమో భారత్ రైళ్లతో పాటు ఏకకాలంలో నడిచాయి. రెండు వ్యవస్థలూ ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా పనిచేయడం గమనార్హం.ఈ విజయం ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్‌లను కలిపే భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ కారిడార్ అమలులో ఒక ముఖ్యమైన కార్యాచరణ మైలురాయిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మార్గంలో అమర్చిన ప్రపంచంలోనే మొట్టమొదటిదైన, ఎల్‌టీఈ బ్యాక్‌బోన్‌పై పనిచేసే అధునాతన ఈటీసీఎస్ లెవెల్ 3 హైబ్రిడ్ సిగ్నలింగ్ వ్యవస్థ, అలాగే ప్రతి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారం స్క్రీన్ డోర్లు  కూడా ట్రయల్ రన్ సమయంలో ఎటువంటి లోపం లేకుండా పనిచేశాయని అధికారులు తెలిపారు.  ప్రస్తుతం ఈ కారిడార్‌లోని 55 కిలోమీటర్ల మార్గం 11 స్టేషన్లతో ప్రయాణికులకు ఇప్పటికే అందుబాటులో ఉంది. మిగిలిన భాగాల్లో.. అంటే ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్-న్యూ అశోక్ నగర్ మధ్య 4.5 కిలోమీటర్లు, మీరట్‌లోని మీరట్ సౌత్-మోదీపురం మధ్య సుమారు 23 కిలోమీటర్ల విభాగంలో ట్రయల్ రన్‌లతో పాటు తుది దశ పనులు వేగంగా జరుగుతున్నాయి.దేశంలోనే మొట్టమొదటిసారిగా నమో భారత్ రైళ్ల కోసం ఉపయోగించే మౌలిక సదుపాయాలపైనే స్థానిక మెట్రో సేవలు కూడా అందించనుండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మీరట్ సౌత్- మోదీపురం డిపో మధ్య మీరట్ మెట్రో ట్రయల్ రన్‌లు కూడా జరుగుతున్నాయి. 13 స్టేషన్లతో కూడిన 23 కిలోమీటర్ల మీరట్ మెట్రో మార్గంలో 18 కిలోమీటర్ల ఎలివేటెడ్, 5 కిలోమీటర్ల భూగర్భ విభాగాలు ఉన్నాయి. ఈ తాజా పరిణామం మొత్తం కారిడార్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించే దిశగా ఒక కీలక పురోగతిగా భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa