ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. లక్ష టన్నుల బియ్యం అక్కడే!

business |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 11:44 PM

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భారతీయ బియ్యం వ్యాపారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ యుద్ధం కారణంగా.. భారతీయ బాస్మతీ బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. దాదాపు లక్ష టన్నుల బియ్యం ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి. షిప్పింగ్, బీమా సేవలు నిలిచిపోవడంతో ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం ఈ విషయాన్ని తెలిపింది. భారతదేశం నుండి బాస్మతీ బియ్యం కొనుగోలు చేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం.. ఇరాన్‌కు సుమారు 1 మిలియన్ టన్నుల బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇప్పుడు నిలిచిపోయిన 1,00,000 టన్నుల బియ్యం మొత్తం ఎగుమతుల్లో 18-20 శాతం ఉంటుందని సంఘం అధ్యక్షుడు సతీష్ గోయల్ తెలిపారు. ఇరాన్ భారతదేశానికి ముఖ్యమైన వ్యాపార భాగస్వామి.


మిడిల్ ఈస్ట్‌లో (పశ్చిమాసియా) పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఇరాన్‌కు వెళ్లాల్సిన సరకుకు.. షిప్పింగ్ నౌకలు, బీమా సదుపాయం అందుబాటులో లేదని సతీష్ గోయల్ చెప్పారు. గుజరాత్‌లోని కాండ్ల, ముంద్రా ఓడరేవుల్లో సరకు నిలిచిపోయింది. యుద్ధం వంటి పరిస్థితుల్లో సాధారణంగా షిప్పింగ్ బీమా పాలసీలు పనిచేయవు. దీనివల్ల ఎగుమతిదారులు సరకును పంపలేకపోతున్నారు.


షిప్పింగ్ ఆలస్యం కావడం, డబ్బు చెల్లింపుల్లో సమస్యలు రావడం వల్ల ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుందని గోయల్ అన్నారు. ఇప్పటికే దేశీయంగా బాస్మతీ బియ్యం ధరలు కిలోకు రూ. 4-5 వరకు తగ్గాయని ఆయన తెలిపారు. ఈ సమస్య గురించి APEDAతో చర్చిస్తున్నామని, జూన్ 30న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడటానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.


2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం 6 మిలియన్ టన్నుల బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేసింది. పశ్చిమాసియా దేశాల నుంచి దీనికి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలు కూడా భారతీయ బాస్మతీ బియ్యానికి ముఖ్యమైన కొనుగోలుదారులు.


ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. రెండు దేశాల మధ్య సైనిక చర్యలు జరిగాయి. అమెరికా కూడా ఈ సంఘర్షణలో ప్రత్యక్షంగానే భాగమైంది. దీనికి తోడు అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ వ్యాపారంలో.. డబ్బు చెల్లింపులు ఆలస్యం కావడం సహా కరెన్సీ సమస్యలు కూడా ఉన్నాయి. షిప్పింగ్ సమస్యలు కూడా తోడవ్వడంతో భారతీయ బియ్యం ఎగుమతిదారులకు కష్టాలు ఎక్కువయ్యాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa