కర్ణాటకలో ఐదు పులులు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. చామరాజనగర జిల్లాలో తల్లి పులితోపాటు నాలుగు చిన్న పులి పిల్లలు చనిపోయి కనిపించడం సంచలనంగా మారింది. అయితే ఆ పులులు సాధారణంగా చనిపోలేదని.. ఓ వ్యక్తి పగతో వాటిని విషం పెట్టి హతమార్చినట్లు తేలింది. తన ఆవును చంపిందనే కారణంతోనే మాదురాజు అనే వ్యక్తి.. ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేసినట్లు తేల్చారు. అదే ఆవుపై విషం చల్లి.. దాని కళేబరాన్ని అడవిలో పడేసి.. ఆ పులులు తినేలా చేసినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో విషం పెట్టిన వ్యక్తితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు.
తమిళనాడు-కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో జరిగిన ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా.. మాదురాజు చేసిన విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదురాజుకు కెంచి అనే ఆవు ఉండేది. ఆ ఆవును ఇటీవల ఒక పులి అడవిలో వేటాడి చంపేసింది. తాము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవును.. పులి వేటాడి చంపడంతో మాదురాజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎలాగైనా అడవిలోని క్రూరమృగాలపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు.
ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ కోనప్ప, నాగరాజుల సాయంతో చనిపోయిన ఆవు కళేబరంపై విషం చల్లి.. దాన్ని అడవికి సమీపంలో పడేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే మొదట ఆ ఆవు కళేబరాన్ని తల్లి పులి తినగా.. ఆ తర్వాత దాని 4 కూనలతో కలిసి మళ్లీ దాన్ని తినడానికి వచ్చింది. అయితే.. ఆ తర్వాతే తల్లి పులితోపాటు దాని నాలుగు కూనలు అక్కడికక్కడే చనిపోయినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మాదురాజుతో పాటు అతడి ఇద్దరు ఫ్రెండ్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం వారిని హనూరు తాలూకాలోని అరణ్య భవన్కు తరలించారు.
ఒకేసారి ఐదు పులులు చనిపోవడం కర్ణాటకలో పెను సంచలనం రేపుతోంది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి వన్యప్రాణులను సంరక్షించడంలో అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే ఆ పులులు చనిపోయాయని.. ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తాజా నివేదిక ప్రకారం.. కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో అత్యధిక పులులు ఉన్న రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa