ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు,,, మళ్లీ ప్రారంభిస్తోన్న పాకిస్థాన్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 09:35 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’‌లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ పునర్నిర్మిస్తోంది. భారత నిఘా సంస్థల తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI), ఆర్మీ కలిసి ఈ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అడవుల్లో చిన్నచిన్న ఉగ్ర శిబిరాలను అధునిక డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి కనిపించకుండా నిర్మిస్తున్నారు. ప్రతి శిబిరం 200 మందికంటే తక్కువ మిలిటెంట్లను మాత్రమే ఉంచేలా ఐఎస్ఐ ఆదేశించినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలియజేశాయి.


పునర్నిర్మించే ప్రదేశాలు:


గతంలో భారత సైన్యం దాడుల్లో నాశనమైన లూని, పుట్వాల్, టిప్పు పోస్టు, చప్రార్ ప్రాంతాల్లోని థర్మల్ మాస్కింగ్, లో-ఫ్రీక్వెన్సీ రాడార్ సదుపాయాలతో పునర్నిర్మాణం కొనసాగుతోంది. కొత్త శిబిరాలు కేల్, దూధ్నియాల్, అథ్ముకాం, లీపా, కోట్లి ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయి. ఈ శిబిరాలకు పాకిస్థాన్ సైనికులు డ్రోన్ నిరోధక వ్యవస్థలతో రక్షణ కల్పిస్తున్నారు.


బహావల్పూర్‌లో ఉగ్రమూకల సన్నాహక భేటీ


జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రంగా భావించే పాకిస్థాన్‌లోని బహావల్పూర్‌లలో ఉగ్రమూకలు సమావేశమయ్యాయి. ఈ కీలక సమావేశంలో జైషే, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థల నేతలు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శిబిరాల పునఃనిర్మాణం, వనరుల పునఃకేటాయింపు, మళ్లీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లు ప్రారంభించే అంశాలపై చర్చించారట. భేటీ అనంతరం “బహావల్పూర్ అమరవీరులు” అంటూ పోస్టర్లు, మాస్క్ ధరించిన గన్‌మెన్లు పాల్గొన్న వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి..


అంతర్జాతీయ నిధుల దుర్వినియోగం


భారత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అందిస్తున్న అంతర్జాతీయ అభివృద్ధి రుణాలలో కొంత భాగం ఈ ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణానికి దారి మళ్లిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ ద్రవి నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్‌కు రూ.8 వేల కోట్ల రూపాయాలు రెండో విడత రుణం మంజూరు చేసింది. ఈ నిధుల విషయంలో భారత్ అభ్యంతరాలను ఐఎంఎఫ్ పట్టించుకోని సంగతి తెలిసిందే.


ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మే 7న తెల్లవారుజామున భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ దాడుల్లో భారత సైన్యం సరిహద్దులు దాటకుండానే అధునాతన లోయిట్రమ్ మ్యునిటింగ్, ఆకాష్ SAM రక్షణ వ్యవస్థ, ఉపగ్రహ నిఘా ద్వారా పాక్, పీఓకేలోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వీటిలో బహావల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా, మురిద్కేలోని మర్కజ్ తోయిబా ఉన్నాయి.


ఈ దాడులతో రగిలిపోయిన దాయాది.. సరిహద్దుల్లో సైనిక స్థావరాలు, పౌరులే లక్ష్యంగా దాడులకు ప్రయత్నించింది. వీటిని భారత్ సమర్ధవంతంగా అడ్డుకుని పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై ఎదురుదాడులు జరిపింంది. చివరకు మే 10న కాల్పుల విరమణ ఒప్పందంతో ఘర్షణలు తగ్గుముఖం పట్టినా ఇప్పుడు పాకిస్థాన్ ఉగ్ర సంస్థలు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నాయి.


‘‘శిబిరాలను చిన్నచిన్న టెక్ కాంప్లెక్స్‌లుగా విభజించడంతో, భవిష్యత్తులో ఎదుర్కొనే స్మార్ట్ నిఘా, చేపట్టే చర్యలు మరింత క్లిష్టం అవుతాయి’’ అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ సమయంలోనైనా చర్య తీసుకునే విధంగా ఇంటెలిజెన్స్‌ను నిరంతరం పర్యవేక్షణలో ఉంచామని, ఒకవేళ కశ్మీర్‌లో మంచు కరిగేలోపే ఆ శిబిరాలు మళ్లీ క్రియాశీలకమైతే, ప్రతిస్పందన తప్పదని న్యూఢిల్లీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ పరిణామాలు పాక్ ఉగ్రవాద విధానానికి మరింత బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa