ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లీకొడుకుల ఘరానా మోసం,,,,ఏకంగా ఎయిర్‌ఫోర్స్ రన్ వే అమ్మేశారు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 08:57 PM

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఒక తల్లి, కొడుకు కలిసి దేశ రక్షణకే ముప్పు తెచ్చేలా చేసిన భారీ మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి, అత్యంత వ్యూహాత్మకమైన ఒక ఎయిర్‌స్ట్రిప్‌ను నకిలీ పత్రాలతో అమ్మేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 1997లో జరిగిన ఈ అక్రమ వ్యవహారం 28 ఏళ్ల తర్వాత, కోర్టు జోక్యంతో బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


 ఫిరోజ్‌పూర్‌లోని ఫట్టువాలా గ్రామంలో పాకిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న ఈ ఎయిర్‌స్ట్రిప్‌, భారత వైమానిక దళానికి (IAF) చాలా కీలకం. 1962 భారత్-చైనా యుద్ధంలో, 1965, 1971 పాక్ యుద్ధాలలో ఇది భారత వాయుసేనకు కీలక వేదికగా నిలిచింది. నిజానికి, ఈ భూమిని బ్రిటిష్ ప్రభుత్వం 1945 మార్చి 12న రెండవ ప్రపంచ యుద్ధం కోసం కొనుగోలు చేసింది. ఆ తర్వాతి నుంచి భారత వాయుసేన ఆధీనంలోనే ఉంది.


అయితే, 1997లో ఉషా అన్సల్, ఆమె కొడుకు నవీన్ చంద్ అనే ఇద్దరు వ్యక్తులు కొందరు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఈ భూమి తమదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆ పత్రాల ఆధారంగా ఈ విలువైన రన్‌వే భూమిని కొందరు వ్యక్తులకు విక్రయించారు. విచారణలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భూమికి అసలు యజమాని అయిన మదన్ మోహన్ లాల్ 1991లోనే చనిపోయారు. కానీ, ఆయన చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత 1997లో.. ఈ అమ్మకాలు జరిగాయి! చనిపోయిన వ్యక్తి పేరు మీద లావాదేవీలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. 2009-10 నాటికి సుర్జిత్ కౌర్, మంజిత్ కౌర్, ముక్తియార్ సింగ్, జగిర్ సింగ్, దారా సింగ్, రమేష్ కాంత్, రాకేష్ కాంత్ వంటి వ్యక్తులు యజమానులుగా రికార్డుల్లో కనిపించారు. సైన్యం ఎప్పుడూ వారికి భూమిని బదిలీ చేయకున్నా ఇది జరిగింది.


కోర్టు ఆగ్రహం


ఈ భారీ మోసం గురించి నిషాన్ సింగ్ అనే విశ్రాంత రెవెన్యూ అధికారి మొదట ఫిర్యాదు చేశారు. కానీ చాలా సంవత్సరాల వరకు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 2021లో హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ స్వయంగా ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది.


దీంతో విసిగిపోయిన నిషాన్ సింగ్ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోనందుకు తీవ్ర వ్యక్తం చేసింది. ఇది దేశ భద్రతకు ప్రమాదమని హెచ్చరించింది. జస్టిస్ హర్‌జిత్ సింగ్ బ్రార్ పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (VB) చీఫ్ డైరెక్టర్‌ స్వయంగా విచారణ చేసి.. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


దర్యాప్తు ముమ్మరం


జూన్ 20న విజిలెన్స్ బ్యూరో సమర్పించిన నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఉషా అన్సల్, నవీన్ చంద్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ కరణ్ శర్మ ఆధ్వర్యంలో ఈ కేసును విచారిస్తున్నారు.


హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత, మే 2025లో ఈ భూమిని తిరిగి రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించారు. దేశానికి సంబంధించిన భూమి కాబట్టి.. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కుంభకోణంలో ఇంకెంత మంది ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. త్వరలోనే ఈ భారీ మోసం వెనుక ఉన్న పూర్తి నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa