ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటో ఛార్జీలను భారీగా పెంచిన ప్రభుత్వం.. ఏకంగా 20 శాతం పెంపు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 10:08 PM

ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే.. ప్రభుత్వం ఆ భారాన్ని మరి కాస్త పెంచింది. ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టే నిర్ణయం తీసుకుంది. ఆటో ఛార్జీలను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న ఛార్జీల మీద ఏకంగా 20 శాతం పెంచి ఆటో డ్రైవర్లకు శుభవార్త.. సామాన్యులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో చాలా మంది క్యాబ్ కన్నా కూడా ఆటోనే బెస్ట్ అనుకుంటారు. అలాంటి వారికి ఇది భారీ షాక్ అనే చెప్పవచ్చు. అయితే మరి ఇంతకు ఆటో ఛార్జీల పెంపు ఎక్కడ జరిగింది.. ఎంత పెంచారనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి.


కర్ణాటక ప్రభుత్వం ఆటో ఛార్జీల పెంపుకు రెడీ అయ్యింది. కొన్ని నెలలుగా దీనిపై తర్జనభర్జనలు జరుగుతుండగా.. చివరకు ఆటో ఛార్జీల పెంపుకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా మొదటి 1.9 కిలోమీటర్లకు బేస్ ఛార్జీని రూ.30 నుండి రూ.36కి పెంచాలని భావిస్తుంది. ఆ తర్వాత కిలోమీటరుకు గతంలో ఉన్న రూ.15ల ఛార్జీని ఇకపై రూ.18కి పెంచాలని భావిస్తుంది. అంటే గతంలో ఉన్న ఛార్జీల మీద మొత్తంగా 20 శాతం పెంచడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. నాలుగేళ్ల తర్వాత బెంగళూరులో ఆటో ఛార్జీలు పెరగనున్నాయి. గతంలో 2021లో చివరగా ఆటో ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు బెంగళూరులోనే అమలవుతాయని తెలిపారు.


ఆటో ఛార్జీల పెంపుకు సంబంధించి జిల్లా రవాణా అథారిటీ(డీటీఏ) సమర్పించిన ఈ ప్రతిపాదనకు కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి నుండి అనుమతి లభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీన్ని ఆమోదిస్తే.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. త్వరలోనే దీనిపై సీఎం సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డీటీఏ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ వివరణాత్మక అధ్యయనం తర్వాత ఛార్జీల సవరణపై సిఫార్సు చేశారు. ఈ ప్యానెల్.. ప్రయాణీకుల డిమాండ్, కార్యాచరణ సవాళ్లు, నగర ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించింది. అలానే ఈ ఏడాది మార్చి నెల ప్రారంభంలో ప్రధాన వాటాదారులతో ఛార్జీల పెంపుపై సంప్రదింపులు జరిపింది.


నగరంలోని ప్రముఖ యూనియన్లు, ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఏఆర్‌డీయూ), ఆదర్శ్ ఆటో, టాక్సీ డ్రైవర్స్ యూనియన్ (ఏఏటీడీయూ)లు ఆటోఛార్జీలకు సంబంధించి బేస్ ధర రూ. 40 ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ. 20 పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే డీటీఏ ఇంత భారీ పెంపుకు ఆమోదం తెలపలేదు. మధ్యే మార్గంగా బేస్ ధరను రూ.36కి ఆ తర్వాత ప్రతి కిలోమీటరు రూ.18 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 16 నుండి ఇక్కడ బైక్ ట్యాక్సీలను నిషేధించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa