బౌద్ధుల మత గురువు దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యం చేసుకోవద్దని భారత్ తేల్చిచెప్పింది. బౌద్దుల 15వ గురువును ఎన్నుకునే అధికారం ప్రస్తుత దలైలామాకే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రిజుజు ఈ మేరకు స్పందించారు. తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని దలైలామా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై స్పందించిన చైనా, తమ ఆమోదం ఉండాల్సిందేనని డిమాండ్ చేసింది. అయితే, దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని కిరణ్ రిజిజు అన్నారు. ఆ నిర్ణయం పూర్తిగా దలైలామా లేదా ఆయన సంస్థ మాత్రమే తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
‘‘దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకొనే హక్కు ఎవరికీ లేదు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనో లేదా ఆ సంస్థ మాత్రమే చేస్తుంది. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైంది’’ అని రిజిజు పేర్కొన్నారు. బౌద్ధుల గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రమంత్రి రిజిజు, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు లల్లన్ సింగ్ హాజరయ్యారు.
కాగా, అంతకు ముందు తన వారసత్వం కొనసాగుతుందని దలైలామా చెప్పారు. భవిష్యత్తు గురువును గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని ఆయన పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు. చైనా మాత్రం దలైలామా ఎంపికకు తమ ఆమోదం ఉండాలని పట్టుబడుతోంది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని తమ విధానాల ప్రకారమే జరగాలని డిమాండ్ చేస్తోంది.
కాగా, 1950లో టిబెట్ను చైనా ఆక్రమించడంతో అప్పటి నుంచి దలైలామా భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. టిబెట్పై పట్టు కోసం తమ చెప్పుచేతల్లో ఉండే దలైలామాను వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. చైనా ఎత్తుగడలను గమనించిన దలైలామా వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ తమదేనని తేల్చి చెప్పారు. కాగా, 'వాయిస్ ఫర్ ది వాయిస్లెస్' పేరుతో దలైలామా రాసిన పుస్తకం ఇటీవలే విడుదలైంది. అందులో తన వారసుడు పుట్టుక గురించి దలైలామా రాశారు. తనకో వారసుడు వస్తాడని.. తన ధర్మాన్ని కాపాడేందుకు అతడు వస్తాడని... అది కూడా చైనా బయటే జన్మిస్తాడని దలైలామా రాసుకొచ్చారు. తన తర్వాత బౌద్ధ గురువు వారసత్వం కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. తానే మళ్లీ పడతానని.. ఆ పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని.. అంటే అది భారత్లో కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa