ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా కాంగ్రెస్‌లో సుంకాల పెంపు బిల్లు,,,తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి జైశంకర్

national |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 06:59 PM

ఆంక్షలు కొనసాగుతున్నా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామనే అమెరికా బెదిరింపులపై భారత విదేశాంగా శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై అమెరికా విధించబోయే 500 శాతం దిగుమతి సుంకాలపై ఆందోళనలను వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు లిండ్సే గ్రాహామ్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లును దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘లిండ్సే గ్రాహామ్ ప్రతిపాదించిన బిల్లు అమెరికా కాంగ్రెస్‌ చర్య అయితే అది భారత ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మేం దానిని గమనించాల్సిందే’’ అని జైశంకర్ పేర్కొన్నారు.


“ఇంధన భద్రతల విషయంలో భారత్‌కు ఉన్న ప్రయోజనాలను మేము ఆయనకు (గ్రాహమ్) స్పష్టంగా వివరించాం... ఈ సమస్య ఎదురైనప్పుడు తగిన విధంగా స్పందిస్తాం’’ అని ఆయన అన్నారు. అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహామ్ ఇటీవల ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ:. ‘‘రష్యా నుంచి ఉత్పత్తులు కొంటూ ఉక్రెయిన్‌కు సహాయం చేయకుంటే అప్పుడు మీ ఉత్పత్తులపై 500 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తాం’’ అని చెప్పారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ బిల్లును ఆమోదించినట్లు గ్రాహామ్ వెల్లడించారు. ఈ బిల్లుకు ఇప్పటికే 84 మంది సెనేటర్లు సంతకం చేశారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్న వేళ ట్రంప్ బెదిరింపులకు దిగారు.


భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?


ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత.. ఆ దేశంపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా చమురుకు డిమాండ్ తగ్గిపోవడంతో తక్కువ ధరకే విక్రయించడానికి రష్యా ముందుకొచ్చింది. ఈ చమురును రాయితీపై భారత్ దిగుమతి చేసుకుంటోంది. మే 2025 నాటికి, రోజుకి 1.96 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఈ మార్పుతో రష్యా చమురు, భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 1 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. ఇది అమెరికాకు అత్యంత ఆందోళనకర విషయం కావచ్చు.


కాగా, దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. ‘‘భారత్-అమెరికా సంబంధాల విషయంలో మేమే నిర్ణయం తీసుకుంటాం.. పాకిస్థాన్ కాదు’’ అని పేర్కొంటూ ఇటీవల భారత్ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాగా, ఈ బిల్లు అమెరికా పార్లమెంటులో మ దారి తీసే అవకాశమున్నా, భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతల విషయంలో స్పష్టమైన దృక్కోణాన్ని చూపించింది. అమెరికా సరైన దౌత్యపరమైన మార్గాన్ని ఎంచుకుంటుందా? లేక వాణిజ్య యుద్ధానికి దిగుతుందా? అనేది త్వరలో తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa