ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో పాకిస్థాన్ పై విరుచుకుపడింది. తాజాగా ఈ దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ దేశం అణుయుద్ధం అంచు వరకు వెళ్లిందని సనావుల్లా సంచలన విషయాన్ని అంగీకరించారు. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాన్ని మోసుకొస్తోందా లేదా అని నిర్ధారించుకోవడానికి తమ సైన్యానికి కేవలం 30 నుంచి 45 సెకన్ల సమయం మాత్రమే లభించిందని, అదే తమ తలరాతను నిర్దేశించిందని ఆయన ఒక పాకిస్థానీ న్యూస్ ఛానల్కు తెలిపారు."భారత్ నూర్ ఖాన్ ఎయిర్బేస్పై బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినప్పుడు, దాన్ని విశ్లేషించడానికి మా సైన్యానికి కేవలం 30-45 సెకన్ల సమయం ఉంది. అంత తక్కువ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడమైనా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒకవేళ మా వైపు వారు పొరపాటుగా అర్థం చేసుకుని ఉంటే, అది ప్రపంచవ్యాప్త అణుయుద్ధానికి దారితీసేది" అని సనావుల్లా వివరించారు. రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న నూర్ ఖాన్ పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన కీలక స్థావరం.జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చడంతో భారత్ ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్లోని నూర్ ఖాన్, సర్గోధా, భోలారీ, జాకబాబాద్తో సహా పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసి రన్వేలు, హ్యాంగర్లను ధ్వంసం చేసింది. భారత్ దాడుల తర్వాత, పాకిస్థాన్ సైన్యం డ్రోన్లు, క్షిపణులతో పశ్చిమ భారతదేశంపై దాడికి ప్రయత్నించగా, భారత రక్షణ వ్యవస్థలు వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయి. అనంతరం, భారత్ పాకిస్థాన్ భూభాగంలోని కీలక సైనిక లక్ష్యాలను ఛేదించింది. ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో క్షిపణి, డ్రోన్ దాడులు జరిగిన అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa