మాలిలోని ఓ సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న ముగ్గురు భారత పౌరులను నిషేధిత అల్-ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడులతో మాలి సతమతమవుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా జులై 1న కాయెస్లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంగణంపై దుండగులు దాడి చేసి.. అక్కడే పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులను బందీలుగా పట్టుకున్నారని అధికారులు వెల్లడించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రెండు రోజల క్రితం అనగా మంగళవారం నాడు దుండగులు కర్మాగారంలోకి చొరబడి దాడి చేశారు. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు భారతీయులను బందీలుగా తీసుకెళ్లారు. ఇండియన్ కార్మికుల కిడ్నాప్కు సంబంధించి ఏ గ్రూపు నుంచి కూడా ప్రకటన రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అనుబంధ గ్రూప్ అయిన జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్.. మాలి అంతటా దాడులకు పాల్పడుతుంది. దీంతో ఈ అపహరణ వెనుక కూడా అదే గ్రూపు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
భారతీయుల కిడ్నాప్పై స్పందించిన భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని తీవ్రమైన హింసాత్మక చర్యగా అభివర్ణించింది. కార్మికులను త్వరగా సురక్షితంగా తీసుకురావాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ గురువారం నాడు ఒక ప్రకటన చేసింది. ‘జూలై 1న, దుండగులు సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంగణంపై దాడి చేసి, ముగ్గురు భారత పౌరులను బలవంతంగా బందీలుగా తీసుకువెళ్లారు. భారత ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. అలానే మా పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము’ అంటూ విదేశాంగా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
బమాకోలోని భారత రాయబార కార్యాలయం.. మాలి అధికారులు, స్థానిక పోలీసులు, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కాంటాక్ట్లో ఉన్నారు. కిడ్నాప్కు గురైన భారతీయ కార్మికులను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కిడ్నాప్కు గురయిన వారి వివరాలను విదేశాంగశాఖ అధికారులు ఇంకా వెల్లడించలేదు. అలానే కిడ్నాప్కు గురైన వారి కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. మాలిలో ఉంటున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏదైనా సాయం అవసరమైతే.. మాలిలోని భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. అలానే కిడ్నాప్కు గురైన భారతీయులను వీలైనంత త్వరగా, సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa