కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. అమాయక భక్తులను నిలువునా దోచుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా.. మరో ఘరానా నకిలీ టికెట్ల మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి తోమాల సేవా టికెట్ల పేరుతో ఒక కుటుంబం నుంచి రూ.65,000 మోసగాడు రాబట్టినట్లు తెలుస్తోంది. డబ్బులు వసూలు చేసి.. నకిలీ టికెట్లు అంటగట్టిన దళారీ చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన విజయ్ అనే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి, శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలను చూడాలని ఆకాంక్షించాడు. తన మిత్రుడి ద్వారా బాలాజీ అనే దళారీ ఫోన్ నంబర్ను పొందాడు. బాలాజీ కోరిన దర్శనం చేయిస్తాడని నమ్మించడంతో అతడు పలు దఫాలుగా ఆరవై ఐదు వేల రూపాయలను అతనికి పంపాడు. అందుకు అతడు పది రోజుల క్రితం విజయ్ కుటుంబ సభ్యులు ఐదు మంది పేర్లతో, టీటీడీ లోగో కలిగిన నకిలీ తోమాల సేవా టికెట్లను బాలాజీ నెట్లో సృష్టించి, విజయ్ మొబైల్కు పంపాడు.
జూలై 2.. బుధవారం రోజున విజయ్ తన కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నాడు. ముందు జాగ్రత్తగా తిరుపతిలో ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు కూడా తీసుకున్నారు. దర్శనానికి వెళ్లే ముందు బాలాజీకి ఫోన్ చేయగా, అతను కాల్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్లకు కూడా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రెఫరెన్స్ లేకుండా దర్శనం టికెట్లు మంజూరు కావని.. ఎంతటి వీఐపీ అయినా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారు స్వయంగా వస్తేనే తోమాల సేవ లేదా ఇద్దరికి మాత్రమే టికెట్లు మంజూరు చేస్తారని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు చేసేదేమీ లేక స్వామివారి ఉచిత దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు.
నకిలీ టికెట్లు అని తెలియగానే, బాధితులు తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, ఎక్కడైతే మొబైల్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ పరిధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు సూచించారు. బాలాజీ బ్యాంక్ అకౌంట్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.
దళారీలు శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రకరకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచుకుంటున్నారు. ఇటువంటి మోసాలపై టీటీడీ, పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ.. భక్తులు బయటి వ్యక్తులను నమ్మి మోసపోతూనే ఉన్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ.. దళారుల ప్రలోభాలకు లోనై అమాయక భక్తులు తమ సొమ్మును, సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa