వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జల్జీవన్ మిషన్ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులను నిర్లక్ష్యంగా వదిలి వేశారని విమర్శించారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ (శుక్రవారం) ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద రూ.1,290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని... తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పుకొచ్చారు. గొంతులు కోస్తామనే వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని చెప్పారు. వైసీపీకి 151 సీట్లు వచ్చి... తాను రెండు చోట్ల ఓడినప్పుడు కూడా వారిని ఎదిరించానని గుర్తుచేశారు. సినిమా డైలాగులు నిజ జీవితంలో బాగుండవని చెప్పుకొచ్చారు. తలదించుకుని పనిచేస్తున్న వారిని రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa