భారతదేశం.. అనేక ప్రాచీన శిల్పకళా వైభవాలకు, సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వం ఉండే మనదేశంలో ప్రతి వంద కిలోమీటర్లకు సంస్కృతీ సంప్రదాయాలు మారిపోతుంటాయి. అలాగే అనేక చారిత్రక ఆధారాలు భూగర్భంలో దాగి ఉన్నాయి. నాటి వైభవానికి ప్రతీకలుగా నిలిచే అనేక చారిత్రక ఆధారాలు.. కాలక్రమంలో దెబ్బతిని భూమిలో కలిసిపోయాయి. అలాంటి చారిత్రక విశేషాలు అప్పుడప్పుడూ, అక్కడక్కడా తవ్వకాల్లో బయల్పడుతూ ఉంటాయి. అలా.. ప్రకాశం జిల్లాలో ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. యర్రగొండపాలెంలో ఉన్న శివాలయం వద్ద ఇటీవల తవ్వకాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి.
యర్రగొండపాలెంలో ప్రాచీన శివాలయం ఉంది. ఆలయ పనులలో భాగంగా గురువారం రోజున.. తవ్వకాలు చేపట్టారు. ఆలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించారు. ట్రాక్టర్ సాయంతో మట్టిని తొలగించి ఊరి బయటకు తరలించారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో భూగర్భంలో ఉండిపోయిన ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డినట్లు తెలిసింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆళ్వారుల విగ్రహాలను మట్టిలో గమనించారు. మొత్తం 11 విగ్రహాలను మట్టిలో గుర్తించి.. సురక్షిత ప్రాంతంలో ఉంచారు.
పురావస్తు శాసన పరిశోధకులు ఈ విగ్రహాలను పరిశీలించి అతి పురాతమైనవిగా గుర్తించారు. ఈ 11 ఆళ్వారుల విగ్రహాలు 15, 16వ శతాబ్దాలకు చెందినవని గుర్తించారు. మరోవైపు ఇలాంటి పురాతన, చారిత్రక సంపదను పరిరక్షించాలని.. స్థానికులు కోరుతున్నారు. గతంలోనూ ప్రకాశం జిల్లాలో చారిత్రక ఆధారాలు లభ్యమైన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa