ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాలు, పట్టణాల రోడ్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు.. గతంలో జాతీయ రహదారుల వెంబడి బైపాస్ రోడ్లు వేశారు.. అయితే వాటిని పట్టించుకోలేదు. తాజాగా కేంద్రం నిధులు ఇస్తుండటంతో అధికారులు వాటి అభివృద్ధికి ప్రణాళికలు వేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న జాతీయ రహదారుల అనుసంధాన రోడ్లను అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నంద్యాల-చిత్తూరు (నేషనల్ హైవే-40), కర్నూలు-గుంటూరు (340సీ), సోమయాజులపల్లె-డోన్ (340బీ), నేషనల్ హైవే 167, నేషనల్ హైవే-44, చెన్నై-సూరత్ 150సీ జాతీయ రహదారుల వెంబడి బైపాస్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో అధికారులు అంచనాలు రూపొందించారు.
నేషనల్ హైవే-40 పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ బైపాస్ రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీనితో పాటుగా 340బీ సోమయాజులపల్లె-డోన్ రహదారిలో బేతంచెర్ల, డోన్ బైపాస్ రోడ్లకు నిధులు కేటాయించారు. కర్నూలు-గుంటూరు 340సీ రహదారిపై నన్నూరు టోల్ప్లాజా దగ్గర ఉన్న బైపాస్ను కూడా అభివృద్ధి చేస్తారు. కర్నూలు జిల్లాలో బళ్లారి-రాయచూరు నేషనల్ హైవే 167కు సంబంధించి.. హాలహర్వి-మాధవరం వరకు 58 కిలోమీటర్ల రోడ్డులో ఆదోని వద్ద బైపాస్కురూ.5 కోట్లు అవసరమని అంచనా వేశారు. బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే-44కు రూ.10 కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. చెన్నై-సూరత్ 150సీ రహదారికి సంబంధించి రూ.10 కోట్లు అవసరమని అంచనాలు సిద్ధం చేశారు అధికారులు.
వర్షాకాలంలో జాతీయ రహదారుల నుంచి బైపాస్ మార్గాలకు వెళ్లే రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మురుగు కాల్వలు లేకపోవడంతో నీరు రోడ్లపై నిలుస్తుండటంతో రోడ్లు కూడా పాడైపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం వన్ టైమ్ ఇంప్రూవ్మెంట్ నిధులు ఇస్తోంది.. వీటితో రోడ్లకు ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణం కూడా చేపడతారు. మొత్తం మీద కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేషనల్ హైవేల నుంచి గ్రామాలు, పట్టణాలకు కనెక్టివిటీ పెరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa