దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక దారుణ సంఘటన న్యాయ వ్యవస్థపై, మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు పెట్టిన ఓ యువతిని.. ఆ నిందితుడు బెయిల్పై బయటకు వచ్చి మరీ కాల్చి చంపేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన తర్వాత పోలీసులు నిందితుడిని వేగంగా అరెస్టు చేయడంతో బాధితురాలి కుటుంబానికి కొంత ఊరట లభించినప్పటికీ.. భద్రతా లోపాలపై ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అబూజైర్ సాఫీ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతంలో కేసు పెట్టింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితుడు ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి అతను బాధితురాలిని వేధించడం, ఆమెను వెంటపడటం వంటివి చేస్తున్నాడు. ఈ వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంది. అయితే ఈ లోపే నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు.
ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం చూసి వెంటనే ఆమె వద్దకు వెళ్లాడు. అక్కడే ముందుగా మాట్లాడేందుకు ప్రయత్నించిన అతడు.. ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాధితురాలికి ఛాతీ భాగంలో బుల్లెట్ తగిలింది. తీవ్ర గాయం కాగా.. నిందితుడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంనటే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులకు కూడా సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. అసలేమైందని ఆరా తీయగా.. అబుజైర్ సాఫీయే తనపై కాల్పులు జరిపాడని బాధితురాలు పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉండగా.. బాధితురాలు మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ అత్యాచారం చేసి జైలు పాలైన ఓ నిందితుడు.. బెయిల్ మీద బయటకు వచ్చి మరీ చంపాలనుకోవడం, నడిరోడ్డు మీదే కాల్పులు జరిపి అందుకు ప్రయత్నించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి సరైన భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందనే విమర్శిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ.. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై, ప్రభుత్వాలపై ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa