ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిలూ పార్టీలకు వెళ్లకండి, అత్యాచారం జరుగుతుంది..: ట్రాఫిక్ పోలీసుల పోస్టర్లు వైరల్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 09:06 PM

మహిళల భద్రతకు సంబంధించిన ఒక వివాదాస్పద పోస్టర్ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపింది. 'లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం వల్ల అత్యాచారం లేదా గ్యాంగ్ రేప్‌కు గురయ్యే అవకాశం ఉంది' అంటూ అహ్మదాబాద్ నగరంలో కొన్ని పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. ఈ పోస్టర్ల వెనుక అహ్మదాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని వార్తలు రావడంతో ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వివాదాస్పద పోస్టర్లను అధికారులు హుటాహుటిన తొలగించారు.


అంతేకాకుండా మరికొన్ని పోస్టర్లలో నిర్జన ప్రాంతాలకు మీ స్నేహితునితో కలిసి వెళ్లకండి.. అలా వెళ్తే అత్యాచారం లేదా గ్యాంగ్ రేప్ జరిగితే అంటూ ప్రశ్నార్థకంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పోస్టర్ల శైలి మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని నేరానికి బాధ్యులను చేసే విధంగా ఉందని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు మండిపడ్డారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించడానికి బదులుగా ఈ పోస్టర్లు.. బాధితులనే నిందితులుగా చూపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. గత మూడేళ్లలో గుజరాత్‌లో 6,500 అత్యాచారాలు, 36 గ్యాంగ్ రేప్‌లు జరిగాయని ఆ పార్టీ వెల్లడించింది.


వివాదం తీవ్రం కావడంతో అహ్మదాబాద్ ట్రాఫిక్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) నీతా దేశాయ్ దీనిపై స్పందించారు. తాము రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను మాత్రమే స్పాన్సర్ చేశామని, మహిళల భద్రతకు సంబంధించిన పోస్టర్లను కాదని ఆమె వివరణ ఇచ్చారు. సతర్క గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా ఈ వివాదాస్పద పోస్టర్లను తయారు చేసి, అంటించిందని ఆమె తెలిపారు. ఆ సంస్థ సభ్యులు తమకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన పోస్టర్లను మాత్రమే చూపించారని, మహిళల భద్రతకు సంబంధించిన పోస్టర్లు తమకు తెలియకుండా అంటించారని డీసీపీ వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ పోస్టర్లను తొలగించామని ఆమె స్పష్టం చేశారు.


ఈ మొత్తం సంఘటన మహిళల భద్రతపై ప్రభుత్వాల వైఖరిని, సమాజంలో నెలకొన్న ఆలోచనా విధానాన్ని మరోసారి బహిర్గతం చేసింది. నేరానికి కారకులను శిక్షించడం, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంపై దృష్టి పెట్టకుండా, బాధితులనే నిందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa