కేంద్ర కేబినెట్ శుక్రవారం రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక ప్రాజెక్టులు, పథకాలకు ఆమోదం లభించింది. ఇందులో ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఇకపైనా కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ. 12,060 కోట్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో భారత దేశంలోని దాదాపు 10.33 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అంటే ప్రస్తుతం ఇన్ని ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగా దాదాపు 45 కోట్ల మంది ప్రయోజనం పొందనున్నట్లు అంచనా. ఈ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల పేరిట.. ఈ ఉజ్వల స్కీమ్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది కేంద్రం. 2016 మే నెలలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఫ్రీగా స్టౌతో పాటు గ్యాస్ సిలిండర్ అందిస్తారు. ఇక లబ్ధిదారుడికి ఒక్కో గ్యాస్ సిలిండర్ మీద రూ. 300 రాయితీ లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమవుతుంది. సంవత్సరానికి 9 గ్యాస్ సిలిండర్ల వరకు తీసుకోవచ్చు. ఈ రాయితీ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. అంటే ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 905 గా ఉండగా.. వీరికి రూ. 605 కే వస్తుందన్నమాట. అంటే ముందుగా రూ. 905 కట్టాలి. రూ. 300 మళ్లీ లబ్ధిదారుల అకౌంట్లో పడతాయి.
ఎలా అప్లై చేయాలి? ఏమేం కావాలి?
ఈ ఉజ్వల పథకం కోసం దరఖాస్తు చేసేవారికి 18 ఏళ్లు నిండి ఉండాలి. మహిళల పేరు మీదే అప్లై చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడ ఇన్కంటాక్స్ చెల్లించే వారికి, ఇంకా ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదని గుర్తుంచుకోవాలి. దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీలో ఫారం నింపి, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆన్లైన్లో కూడా దీని కోసం అప్లై చేసుకోవచ్చు.
ఇక ఇదే సమయంలో కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ. 30 వేల కోట్ల పరిహారం ప్రకటించింది. అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దేశీయంగా తక్కువ ధరలకే LPG గ్యాస్ విక్రయించడం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం వీటికి నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల్ని పూడ్చేందుకు కేంద్రం ఈ నిధుల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనిని ఈ 3 సంస్థలకు 12 ట్రాంచీల్లో అందించనున్నట్లు స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa