ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ జిల్లాకు 28 కొత్త రహదారులు.. రూపురేఖలు మారనున్నాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 09:49 PM

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం, మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. గుంతలమయమైన రహదారులను బాగు చేసే పనిలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కొత్త రహదారుల నిర్మాణంతో పాటుగా గోతులమయంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టింది. గతేడాది కొన్ని రహదారులను బాగు చేయగా.. ప్రస్తుతం నాబార్డు, ప్లాన్ నిధులతో కొత్త రహదారులు నిర్మించనుంది. ఇందుకోసం కొన్నిచోట్ల పనులకు టెండర్లు పిలిచింది. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. 28 కొత్త రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, రాజమహేంద్రవరం పరిధిలో 28 కొత్త రహదారుల నిర్మాణం కోసం ఎస్‌ఈ, సీఈ స్థాయి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. దీంతో అధికారులు టెండర్లు పిలిచారు. ఈ రోడ్ల పనులకు రూ.63.52 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.


ఇందులో భాగంగా ఉండి నియోజకవర్గం పరిదిలోని వాండ్ర సీసలి రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.2.65 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అలాగే 3 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో ఉరదాళ్లపాలెం నుంచి దువ్వ వరకూ రహదారి నిర్మించనున్నారు. అలాగే మార్టేరు నుంచి ప్రక్కిలంక రహదారి నిర్మాణం కోసం మూడు కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రూ.4.20 కోట్లు వ్యయంతో కానూరు నుంచి లంకలకోడేరు వరకూ రహదారి నిర్మించనున్నారు. అలాగే నాలుగు కోట్ల వ్యయంతో చేబ్రోలు నుంచి దేవులపల్లి వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.


వీటితో పాటుగా 3 కోట్ల 30 లక్షల వ్యయంతో నరసాపురం నుంచి అశ్వారావుపేట రోడ్డు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లు నుంచి దొద్దిపట్ల రోడ్డు, రెండున్నర కోట్ల వ్యయంతో పెనుమంట్ర నుంచి వీరవాసరం రహదారి నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. అలాగే ఒకటిన్నర కోటి వ్యయంతో పాలకొల్లు - ఆచంట రోడ్డు నిర్మించనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కూడా చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తాన్ని రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో మౌలిక వసతుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa