ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ బాండ్ ఇంత లాభమా.. కాసుల పంట పండింది

business |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 10:19 PM

బంగారం.. భారతీయులకు ఎంతో ఇష్టం. ఇది ఆభరణంగానే కాకుండా.. పెట్టుబడులకు కూడా మంచి సాధనం అని చెప్పొచ్చు. అందుకే చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. అనిశ్చితి వేళ సురక్షిత సాధనంగా ఉంటుంది. అయితే బంగారంపై పెట్టుబడుల కోసం.. గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలానే ఉన్నా ఆర్బీఐ నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అత్యంత ఆదరణ పొందింది. ఇటీవల ప్రభుత్వానికి భారం కాగా.. ప్రస్తుతానికి కొత్తగా వీటిని జారీ చేయట్లేదు. అయితే.. గతంలో ఇష్యూ చేసిన బాండ్ల కాలపరిమితి ఇంకా ముగియనివి ఉన్నాయి. వాటికి సంబంధించి ఇన్వెస్టర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది.


కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. స్టాక్ ఎక్స్చేంజీలు, బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. కనీసం గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల వరకు వరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇంకా వార్షిక ప్రాతిపదికన వడ్డీ కూడా ఉంటుంది.


గోల్డ్ బాండ్ల కాల పరిమితి 8 సంవత్సరాలు అయితే.. ఐదేళ్ల తర్వాత కూడా ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదేళ్లు పూర్తయిన రెండు గోల్డ్ బాండ్ ట్రాంచీలకు సంబంధించి ఆర్బీఐ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ (ముందస్తు ఉపసంహరణ ధర) ప్రకటించింది. అవి 2019-20 సిరీస్ - IX, 2020-21 సిరీస్- V. వీటి ఐదేళ్ల గడువు 2025, ఆగస్ట్ 11 అని ప్రకటించింది. రిడెంప్షన్ ప్రైస్ గ్రాముకు రూ. 10,070 అని ప్రకటించింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు బంపర్ రిటర్న్స్ వస్తున్నాయి. అప్పట్లో ధర చాలా తక్కువ ఉండటం తెలిసిందే.


>> 2019-20 సిరీస్- IX గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాముకు రూ. 4070 కాగా.. రూ. 50 డిస్కౌంట్‌తో రూ. 4020 కే వచ్చింది. ఇక్కడ ఇక 150 శాతానికిపైగా రిటర్న్స్ వచ్చాయి. ఇంకా వార్షిక ప్రాతిపదికన 2.50 శాతం వడ్డీ అదనం. ఇప్పుడు రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఎంతొచ్చిందో తెలుసుకుందాం. గ్రాముకు రూ. 4020 లెక్కన రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 24.87 గ్రాముల బంగారం వచ్చింది. ఇప్పటి రూ. 10,070 లెక్కన ఈ మొత్తం రూ. 2.50 లక్షలకు చేరింది. దీనికి వడ్డీ అదనం.


>> 2020-21 సిరీస్- V విషయానికి వస్తే ఇష్యూ ధర రూ. 5334 గా ఉండగా.. రూ. 50 డిస్కౌంట్‌తో రూ. 5,284 అయింది. ఇక్కడ రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి వడ్డీ కాకుండా రూ. 1.90 లక్షలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa