జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 10 ఏళ్లుపైబడిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాల నిషేధం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఆ వాహనాల యజమానులపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 10 ఏళ్లు మించిన పాత డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పాత పెట్రోల్ వాహనాలపై పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కి నోటీసు జారీ చేసింది.
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పాత డీజిల్, పెట్రోల్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాహనదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్య దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయిని మించిపోతుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పంజాబ్, హర్యానా, యూపీలోని రైతులు పంటల వ్యర్థాలను దగ్దం చేయడం వల్ల జాతీయ రాజధానిలో గాలి విషతుల్యమైపోతుంది. దీంతో ప్రజలు గాలి పీల్చుకుంటే ఊపిరి ఆగిపోయే పరిస్థితి నెలకుంటుంది.
ఢిల్లీలో దీపావళి తర్వాత ఏటా గాలి నాణ్యత సూచి అత్యంత తీవ్రమైన స్థితికి పడిపోతుంది. దట్టమైన కాలుష్యం, పొగమంచుతో మధ్యాహ్నం 12 గంటలైనా సూర్యుడి జాడ కనిపించదు. గాలి కాలుష్య ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో వాయు నాణ్యత క్షీణించకుండా ఢిల్లీ అధికారులు అన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి.. కఠిన ఆంక్షలు విధిస్తారు. వీటిని ఎవరైనా సరే ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలకు చేపడతారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జాతీయ రాజధాని ప్రాంతంలో పదేళ్ల దాటిన డీజిల్, పదిహేనేళ్లు దాటి పెట్రోల్ వాహనాలను ఢిల్లీ సర్కారు నిషేధించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నింపరాదని ఆదేశించింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సాంకేతికంగా ఇవి అమలు సాధ్యం కాదని భావించింది. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటి ఉత్తర్వులు తీసుకొచ్చినట్టు తెలిపింది. కానీ, దీనిని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణ కొనసాగుతోంది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa