భారత న్యాయ వ్యవస్థలో సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పును ఇచ్చింది. జీవిత ఖైదు శిక్ష అనుభవించి.. తమ నిర్దేశిత శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని, మరే ఇతర కేసులో దోషిగా లేదా నిందితుడిగా లేని ఖైదీలను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు జైళ్లలో సంవత్సరాలుగా మగ్గుతున్న ఎందరో ఖైదీలకు కొత్త ఆశలను కల్పించింది. జైలు శిక్షా కాలం తగ్గింపు కోసం ప్రత్యేకంగా క్షమాభిక్ష (remission) కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుంటే చాలు వారిని విడుదల చేయవచ్చని కోర్టు పేర్కొంది.
నితీశ్ కటారా హత్య కేసులో కీలక తీర్పు..
సుప్రీంకోర్టు ఈ తీర్పును ఒక ప్రత్యేక కేసులో వెలువరించింది. 2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో.. 2015లో సుఖ్దేవ్ పెహల్వాన్ దోషిగా తేలాడు. దీంతో న్యాస్థానం ఇతడికి 20 ఏళ్లు శిక్ష తగ్గింపు లేకుండా శిక్షను విధించింది. పెహల్వాన్కు విధించిన 20 సంవత్సరాల కఠిన శిక్షా కాలాన్ని అతను ఈ ఏడాది మార్చి నెలకే పూర్తి చేసుకున్నాడు. అయినప్పటికీ విడుదల చేయకపోవడంతో.. తనను వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
జూలై 29వ తేదీన విచారణ జరిపిన కోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ అతడి ప్రవర్తనను విశ్లేషించిన అధికారులు.. సుఖ్దేవ్ను విడుదల చేసేందుకు నిరాకరించారు. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల శిక్షా కాలం ముగిసినందున, మరో ఇతర కేసులోనూ ఈయన దోషిగా, నిందితుడిగా లేకపోవడంతో.. అతనిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుఖ్దేవ్ పెహల్వాన్ వంటి దోషులు నిర్దేశిత శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుంటే.. రెమిషన్ ప్రక్రియ అవసరం లేకుండా వారిని విడుదల చేయవచ్చని కోర్టు తన తీర్పులో విశ్లేషించింది.
శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు ఇంకా జైల్లోనే ఉండడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వైఖరి కొనసాగితే.. దోషి జైల్లోనే మరణిస్తాడని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. పహిల్వాన్ ఒక్కడే కాకుండా గడువుకు మించి ఇంకా ఎవరైనా దోషులు లేదా నిందితులు జైల్లోనే ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను అన్ని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
భారత శిక్షా స్మృతి ప్రకారం.. ఒక వ్యక్తి జీవిత ఖైదు శిక్ష పొందినప్పుడు సాధారణంగా అతడు తన జీవితాంతం జైలులో ఉండాలి. అయితే గతంలో కొన్ని తీర్పులలో 14 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల శిక్షా కాలం తర్వాత సత్ప్రవర్తనను బట్టి ప్రభుత్వం యొక్క రెమిషన్ అధికారం ప్రకారం విడుదల చేసే పద్ధతి అమలులో ఉండేది. ఈ రెమిషన్ ప్రక్రియలో కొన్నిసార్లు జాప్యం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు రాజకీయ కారణాల వల్ల నిర్ణయాలు వెలువడకపోవచ్చు. కానీ తాజా సుప్రీంకోర్టు తీర్పు ఈ ప్రక్రియలోని గందరగోళానికి ఒక ముగింపు పలికింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత విడుదల అనేది ఒక ఖైదీ యొక్క హక్కుగా ఈ తీర్పు ద్వారా పరిగణించబడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa