ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లోక్సభను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఓటర్ల జాబితాలో లోపం మాత్రమే కాదని, భారత ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి, పక్షపాతానికి నిదర్శనమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ అంశంపై బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్రమంగా ఓటర్ల జాబితాను ఉపయోగించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఒకే ఓటర్ ఐడీ నంబర్ తో చాలా మంది ఓటర్లు ఉన్నారని.. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈసీఐ విడుదల చేసిన అధికారిక డేటాను ప్రస్తావిస్తూ.. ఈ అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అయినా కూడా బీజేపీ ఈసీఐని ఎందుకు వెనకేసుకొస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ రకమైన అవకతవకలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇది ప్రజల ఓటు హక్కును అపహాస్యం చేసే చర్య అని అభిషేక్ బెనర్జీ అన్నారు.
అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో నిరసన తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేసి అదుపులోకి తీసుకోవడాన్ని కూడా అభిషేక్ బెనర్జీ ఈ ఓటర్ల జాబితా వివాదంతో ముడిపెట్టారు. ఎంపీలపై జరిగిన ఈ దాడి ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నమే అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయని అన్నారు.
ఈ అంశంపై అభిషేక్ బెనర్జీ కొన్ని కఠినమైన డిమాండ్లు చేశారు. ప్రస్తుతానికి లోక్సభను రద్దు చేయాలని.. అలాగే ఈ అవకతవకలకు బాధ్యుడైన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్పై నేర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అక్రమంగా మార్చబడిన ఓటర్ల జాబితా ద్వారా గెలిచిన ఏ రాజకీయ నాయకుడైనా.. అందులో ప్రధాన మంత్రి, హోం మంత్రి ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన డిమాండ్లకు కట్టుబడి, కొత్త ఎన్నికలు నిర్వహించడానికి తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
తాను మాత్రమే కాకుండా ప్రతిపక్ష ఎంపీలు అందరు కూడా ఇందుకు సిద్ధమేనన్నారు. ముఖ్యంగా గుజరాత్, యూపీ, మధ్య ప్రదేశ్లలో ఓటర్ జాబితాలు సరిగ్గానే ఉన్నాయని.. బెంగాల్, బీహార్లో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. బీహార్లో న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే కచ్చితంగా బీజేపీ ఓడిపోతుందని అన్నారు. అభిషేక్ బెనర్జీ చేసిన ఈ సవాలు, దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa