ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపిక నశిస్తే బ్రహ్మోస్ క్షిపణులు పాక్‌లోకి దూసుకెళ్తాయి..: మిథున్ చక్రవర్తి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 09:13 PM

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సింధూ నదీ జలాల ఒప్పందంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు భారతీయ సినీ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి ఘాటుగా స్పందించారు. పాక్ తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే.. భారత్ ఓపిక నశిస్తుందని అన్నారు. ఈక్రమంలోనే బిలావల్‌కు సినిమా స్టైల్ హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ బిలావల్ భుట్టో తన బెదిరింపులను కొనసాగిస్తే.. భారత్ తన శక్తిని ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడదని, అప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు రంగంలోకి దిగుతాయని వివరించారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందీ ప్రజలంతా యుద్ధం చేస్తారని వెల్లడించారు.


భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తమ దేశానికి పెద్ద నష్టం జరిగిందని బిలావల్ భుట్టో ఇటీవలే ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తీసుకున్న చర్యలు పాక్‌కు చాలా నష్టం కల్గించాయన్నారు. ముఖ్యంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనేది పాకిస్థాన్‌ చరిత్ర, సంస్కృతి, నాగరికతపై దాడి అవుతుందని అన్నారు. అంతేకాకుండా యుద్ధం వంటి పరిస్థితులు వస్తే పాకిస్థాన్‌ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే శక్తి ఉందని ఆయన సవాలు విసిరారు. ఈ వ్యాఖ్యలు భారత్‌లోని రాజకీయ నాయకులతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.


ముఖ్యంగా బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై మిథున్ చక్రవర్తి స్పందిస్తూనే.. ఘాటు సమాధాంన చెప్పారు. "బిలావల్ భుట్టో.. మేము 140 కోట్ల మంది భారతీయులం. మేము ఒక ఆనకట్ట నిర్మించాలనుకుంటున్నాం. అది కూడా భారతీయులందరి మూత్ర విసర్జనతో. దాన్ని ఒక్కసారిగా తెరిచామంటే పాకిస్థాన్‌కు సునామీ వస్తుంది" అని అన్నారు. అలాగే నేను చేసిన ఈ వ్యాఖ్యలు.. పాకిస్థాన్ ప్రజలు అందరికీ కాదని.. కేవలం బిలావల్ భుట్టోకు మాత్రమే అని కూడా స్పష్టం చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా యుద్ధానికి వస్తే.. మా ఓపిక నశించి బ్రహ్మోస్ క్షిపణులను మీ దేశంపైకి పంపుతామన్నారు.


అయితే బిలావల్ భుట్టో ఈ కామెంట్లు చేయడానికి కొన్ని గంటల ముందే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా వేధికగా షాకింగ్ కామెంట్లు చేశారు. పాకిస్థాన్‌కు ఏదైనా ముప్పు ఏర్పడితే.. అది సగం ప్రపంచాన్ని తనతో పాటు తీసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని గుర్తు చేశారు. వాటి ద్వారానే ఇతర దేశాలపై పగ తీర్చుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను కూడా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అణు బెదిరింపులు పాకిస్థాన్‌కు అలవాటేనిని సమాధానం ఇచ్చింది.


ఇదిలా ఉండగా సింధూ నదీ జలాల ఒప్పందం.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్థాన్‌ల మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక ఒప్పందం. దీని ప్రకారం ఇరు దేశాల మధ్య నదుల జలాల పంపిణీ జరుగుతుంది. రాజకీయంగా ఎంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ.. ఈ ఒప్పందం దాదాపు ఆరు దశాబ్దాలుగా అమలులో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో పాకిస్థాన్‌ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు ఈ ఒప్పందం భవిష్యత్తుపై కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa