ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫ్రీడమ్' ఆఫర్.. 1 రూపాయికే రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

business |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 11:07 PM

భారతీయ టెలికాం రంగంలో అత్యధిక మార్కెట్ వాటా ప్రైవేట్ రంగంలోని కంపెనీల చేతిలో ఉంది. అయితే, గత కొద్ది నెలల నుంచి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. మార్కెట్ వాటా పెంచుకునేందుకు ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలతో పోటీ పడుతూ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. మొబైల్ వినియోగదారులను తనవైపునకు తిప్పుకుంటోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందిస్తూ ఎప్పటికప్పుడు ఊహించని నిర్ణయాలు తీసుకుంటోంది.


భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సంచలనమైన రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా కేవలం ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. అంటే ఈ ముప్పై రోజుల పాటు రోజుకు 2జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్‌ సేవలు పొందవచ్చు.


భారత టెలికాం చరిత్రలోనే అతి తక్కువ ధరతో అత్యధిక ప్రయోజనాలు కల్పిస్తోన్న ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ నెల చివరిలోపు రూ.1 చెల్లించి రీఛార్జ్ చేసుకుని 30 రోజుల పాటు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇదే సమయంలో 4జీ సిమ్ సైతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ పొందేందుకు మీ సమీపంలోని రిటైల్ లేదా బీఎస్ఎన్ఎల్ కామన్ సర్వీస్ కేంద్రాలను సందర్శించాలని తెలిపింది.


మరోవైపు.. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.47000 కోట్లు కేటాయించింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో రూ.25 వేల కోట్ల క్యాపెక్స్ పూర్తి సింది. ఇప్పుడు దేశంలో ఒక లక్ష కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో తమ నెట్ పరిధిని పెంచుకోనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నెట్ వర్క్ విస్తరణ చేపడతామని తెలిపింది. ప్రస్తుతానికి 4జీ విస్తరణపై దృష్టి సారించిన బీఎస్ఎన్ఎల్ త్వరలోనే 5జీ టెక్నాలజీ కోసం ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa