ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ధరల్లో ఊహించని మార్పు.. ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 10:41 PM

 బంగారం ధరలు ఎన్నో అంశాల ఆధారంగా ప్రభావితం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ద్రవ్యోల్బణం, GDP, అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఇలా చాలానే ఎఫెక్ట్ చూపిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. అమెరికాలో జరిగే కీలక పరిణామాలు కూడా బంగారం ధరల్లో ఊహించని హెచ్చుతగ్గులకు కారణంగా నిలుస్తాయి. ఇక్కడ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ వాల్యూ, యూఎస్ లేబర్ మార్కెట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, ఇతర నిర్ణయాల కారణంగా బంగారం ధరలు మారుతుంటాయి. ఇప్పుడు బంగారం ధరల్లో కీలక మార్పుకు కారణమయ్యే ఒక ప్రకటన వచ్చింది.


అదే యూఎస్ ఫెడ్ చైర్మన్ నుంచి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. యూఎస్ డాలర్ డిమాండ్ పెరిగి బంగారం ఆకర్షణ కోల్పోతుంది. దీంతో ధరలు దిగిస్తుంటాయి. అదే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే అప్పుడు డాలర్ విలువ తగ్గి.. బంగారం ధర పెరుగుతుంది.


 కొంత కాలంగా ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బంగారం ధరల్లో కూడా పెద్దగా మార్పు ఉండట్లేదు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచట్లేదు కాబట్టి.. బంగారం ధర తగ్గట్లేదు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్ సహా దాని చైర్మన్ జెరోమ్ పావెల్‌పై ఒత్తిడి చేస్తున్నా కూడా మాట వినట్లేదు. ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందోనని అంచనా వేసేందుకు స్థిరంగా ఉంచుతూ వస్తున్నారు.


తగ్గనున్న ఫెడ్ వడ్డీ రేట్లు..


కానీ ఇప్పుడు మాత్రం ఊహించని ప్రకటన చేశారు. సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఫెడ్ యాన్యువల్ జాక్సన్ హోల్ కాన్ఫరెన్స్‌లో దీని గురించి మాట్లాడారు. ఇది జాబ్ మార్కెట్‌ను రిస్క్‌లో పడేసే అవకాశం ఉందని.. ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉందని.. అయినప్పటికీ తగ్గించక తప్పని పరిస్థితులు ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 16-17న ఫెడ్ సమావేశం కానుంది. దీంతో ఒక్కసారిగా డాలర్ పతనం అయింది. ఒక శాతం వరకు పడిపోయింది. దీంతో ఇతర కరెన్సీల్లో బంగారం తక్కువకు లభిస్తుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో ఊహించినట్లుగానే గోల్డ్ రేట్లు భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయంగా ఒక్కసారిగా 40- 50 డాలర్ల వరకు పెరిగి 3370 డాలర్ల మార్కు పైనికి చేరింది. సిల్వర్ కూడా దాదాపు 39 డాలర్లకు చేరువైంది.


దేశీయంగా కూడా పసిడి ధరల్లో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 1000 పెరగడం గమనార్హం. దీంతో ఇప్పుడు తులం రూ. 93150 కి చేరింది. 24 క్యారెట్ పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1090 ఎగబాకి రూ. 1,01,620 కి పెరిగింది. వెండి ధర కూడా ఏకంగా రూ. 2000 పెరిగి కేజీకి రూ. 1.30 లక్షలకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa