ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా ఆయిల్‌తో బ్రాహ్మణులకే లాభం.. భారత్‌పై ట్రంప్ సలహాదారు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 08:00 PM

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై మరోసారి అగ్రరాజ్యం అక్కసు వెళ్లగక్కింది. క్రెమ్లిన్ నుంచి ఆయిల్ కొంటూ భారత్ లాభాలు ఆర్జిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నావారో ఆరోపించారు. రష్యా కోసం భారత్ చాకిరేవు దుకాణం నడుపుతోందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆ దేశంలోని సంపన్న వర్గం సామాన్యుల పేరు మీద లాభార్జన చేస్తోందని వైట్‌హౌస్ సలహాదారు విమర్శించారు. ‘రష్యా యుద్ధానికి ఆర్ధిక వనరులను సమకూరుస్తూ భారత్ ఉక్రెయిన్‌ ప్రజలను చంపుతోంది....పన్నుచెల్లింపుదారులుగా మేము ఏమి చేయాలి? మరింత సాయం వారికి అందజేయాలి’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనపై కూడా నవారో విమర్శలు చేశారు.


‘ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి చేయడానికి ముందు రష్యా నుంచి భారత్ పెద్దగా చమురు కొనుగోలు చేయలేదు.. కానీ ఇప్పుడు భారీ ఎత్తున ఆయిల్ కొంటూ మాస్కో యుద్ధానికి ఇంధనం అందిస్తోంది’ అని నావారో ధ్వజమెత్తారు. ‘భారత్ అనేది రష్యాకు లాండ్రీ దుకాణం తప్ప ఇంకొటి కాదు... మీరు చూస్తున్నారు బ్రాహ్మణులు భారతీయలు ఖాతా మీద లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది ఆగాలి’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సలహాదారు నావారో వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణల ప్రకారం.. భారత రిఫైనరీలు డిస్కౌంట్ ధరలకు రష్యా నుంచి ముడి చమురును కొని, దాన్ని శుద్ధిచేసి అధిక ధరలకు ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.


ఇదే సమయంలో భారత్‌పై అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు టారీఫ్‌లను సమర్దిస్తూ.. న్యూఢిల్లీ- మాస్కో, బీజింగ్ సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘భారత ప్రధాని మోదీ గొప్ప నాయకుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడైన మోదీ గొప్ప నేత. కానీ, ఆయన ఎందుకు పుతిన్, జిన్‌పింగ్‌లతో కలసి పనిచేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని నావారో వ్యాఖ్యానించారు.


షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్  శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో పీటర్ నావారో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏడేళ్ల తర్వాత పొరుగు దేశానికి వెళ్లిన మోదీ.. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. చైనా, భారత్‌లపై ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు గతేడాది సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంబంధాల పునరుద్దరణకు చర్యలు ప్రారంభించాయి.


రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి ఒకే వాహనంలో ద్వైపాక్షిక చర్చల కోసం బయలుదేరడం విశేషం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో భారత్, రష్యా వాణిజ్య సంబంధాలపై అమెరికా వాగ్దాడి మరింత తీవ్రతరం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa